షాతో జగన్ భేటీ… ఏపీలో సీబీఐ దూకుడు పెరుగుతుందా?

నవ్యాంధ్ర వ్యవహారాలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం హోదాలో ఢిల్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీని ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లే లక్ష్యంగా చేసుకుని విచారణకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి భేటీలో అమిత్ షాతో జగన్ ఈ విషయాలపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటి అంశాపైనా జగన్, షాల మధ్య చర్చలు జరిగినా… ప్రధానంగా అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చలు జరిగినట్టుగా సమాచారం. అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబు అండ్ కో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో నారా లోకేశ్ మంత్రిగా ఉండగా ఫైబర్ నెట్ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని కూడా జగన్ అండ్ కో వాదిస్తోంది. ఈ రెండు అంశాలపై సీబీఐ చేత విచారణ చేయించి చంద్రబాబుతో పాటు లోకేశ్ ను కూడా ఇరుకునపెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతీ తెలిసిందే.

ఈ క్రమంలో గతంలో మాదిరిగా కాకుండా ఢిల్లీ వచ్చిన వెంటనే తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం, తన ఢిల్లీ పర్యటనలో జగన్ తొలుత షాతోనే భేటీ కావడం వైసీపీకి ఒకింత సానుకూల అంశమేనని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో తన ప్రత్యర్థులపై సీబీఐని రంగంలోకి దించే దిశగా కేంద్రాన్ని ఒప్పించడమే లక్ష్యంగా జగన్ వ్యూహం రచించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే షాతో భేటీలో జగన్ ఈ అంశాలనే ప్రదానంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సజావుగా అమలయ్యే దిశగానూ సహకరించే విషయంలోనే షా మద్దతును జగన్ కోరినట్టుగా కూడా సమాచారం. మొత్తంగా జగన్ చేసిన ప్రతిపాదనలకు షా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ… షా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలు ఏపీ రాజకీయాలను తీవ్రంగానే ప్రభావితం చేయనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.