కొత్త సినిమాలు.. రిలీజవుతున్నట్లే లేదు


మళ్లీ శుక్రవారం వచ్చేసింది. కానీ కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించడం లేదు. మామూలుగా అయితే ఈపాటికి ‘లవ్ స్టోరి’ సినిమా హడావుడి నడుస్తుండాల్సింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి నటించిన ఈ క్రేజీ మూవీపై మంచి అంచనాలున్నాయి. రిలీజ్ దగ్గర పడేకొద్దీ దీనికి హైప్ పెరిగింది. ముందు అనుకున్న ప్రకారమే అయితే ఈ శుక్రవారం ఆ చిత్రం థియేటర్లలోకి దిగాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాను వాయిదా వేసేశారు.

గత వారం రిలీజైన ‘వకీల్ సాబ్’ బాగానే ఆడుతున్నప్పటికీ.. అందుబాటులో బోలెడన్ని థియేటర్లు ఉండటంతో వేరే రెండు కొత్త సినిమాలను ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దించుతున్నారు. కానీ ఆ చిత్రాలు విడుదలవుతున్నాయన్న పట్టింపే ప్రేక్షకుల్లో కనిపించట్లేదు.

ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం.. 99 సాంగ్స్. ఆదిత్య సీల్ అనే కొత్త హీరోను పెట్టి విశ్వేష్ కృష్ణమూర్తి పూర్తి సంగీత ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ చూస్తే బాగానే అనిపించింది. ఐతే కొత్త హీరో, పైగా తెలుగు సినిమా కాదు అనే ఫీలింగ్‌‌తో మన జనాలు ఈ చిత్రం పట్ల పెద్దగా ఆసక్తి ప్రదర్శించట్లేదు. మన వాళ్లు ఓన్ చేసుకునేలా దీన్ని ప్రమోట్ చేయడంలోనూ రెహమాన్ అండ్ కో విఫలమైంది. సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజవుతున్నా.. బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు.

ఇక రామ్ గోపాల్ వర్మ తన స్టోర్ రూం నుంచి బయటికి తీసిన పాత సినిమా ‘దెయ్యం’ పరిస్థితి మరీ దారుణం. రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘పట్టపగలు’ పేరుతో తెరకెక్కిన ‘దెయ్యం’ అనే టైటిల్‌కు మారిన ఈ సినిమాకు బుకింగ్స్ పూర్తిగా నిల్ అన్నట్లే ఉంది. ఈ సినిమాకు బోలెడన్ని థియేటర్లు ఇచ్చారు కానీ.. ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది. మరి ఈ రెండు కొత్త సినిమాలకు మంచి టాక్ ఏమైనా వచ్చి.. థియేటర్ల వైపు ప్రేక్షకులను ఆకర్షిస్తాయేమో చూడాలి.