గిరాకీ లేని ఆన్ లైన్ థియేట‌ర్‌


లాక్ డౌన్ టైంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కింది. జ‌నాలంద‌రూ వ‌రుస‌బెట్టి వివిధ ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆ ఫ్లాట్ ఫామ్స్ కూడా కొత్త సినిమాల‌ను పెద్ద ఎత్తునే రిలీజ్ చేశాయి. ఐతే ఇలా ఓటీటీలు చెప్పిన రేటుకు సినిమాను ఇవ్వ‌డం ఎందుకు.. మ‌న‌మే సొంతంగా ఆన్‌లైన్లో రిలీజ్ చేసేద్దామ‌ని ఆన్ లైన్ థియేట‌ర్లు తెరుచుకున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి వాళ్లు.

ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కూడా ఇలా ఆన్ లైన్ థియేట‌ర్ మొద‌లుపెట్టింది. పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఇందులో సినిమాలు రిలీజ్ చేశారు. ముందుగా రామ్ గోపాల్ వ‌ర్మ‌నే క్లైమాక్స్, న‌గ్నం, ప‌వ‌ర్ స్టార్, థ్రిల్ల‌ర్ అంటూ వ‌రుస‌బెట్టి ఇందులో సినిమాలు వ‌దిలాడు.

మొద‌ట్లో కుర్రాళ్లు బాగానే డ‌బ్బులు పెట్టి ఆయ‌న సినిమాలు చూసిన‌ట్లు క‌నిపించింది. వ‌ర్మ‌కు బాగానే గిట్టుబాటు అయింది. కానీ వీటిలో విష‌యం త‌క్కువ‌, ప‌బ్లిసిటీ హ‌డావుడి ఎక్కువ అని అర్థ‌మై చూడ్డం మానేశారు. ఆ ప్ర‌భావం వేరే పే ప‌ర్ వ్యూ సినిమాల మీదా ప‌డింది. ఈ మ‌ధ్య ఇలా రిలీజ్ చేస్తున్న ఏ సినిమాకూ ఆశించిన స్పంద‌న ఉండ‌ట్లేదు. తాను తెర‌కెక్కించిన న‌ర్త‌న‌శాల ‌లోంచి చిన్న వీడియో బిట్ తీసి నంద‌మూరి బాల‌కృష్ణ రిలీజ్ చేస్తే పెద్ద‌గా స్పంద‌న లేక‌పోయింది. వ‌ర్మ ఈ మ‌ధ్య ఇలా రిలీజ్ చేస్తున్న సినిమాల గురించి ప‌ట్టించుకునేవాళ్లే లేరు. వేరే సినిమాల ప‌రిస్థితీ అంతే.

హిందీలో ఖాలీపీలి, త‌మిళంలో క‌పె ర‌ణ‌సింగం లాంటి సినిమాలను పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేస్తే అనుకున్నంత‌గా రెవెన్యూ రాలేదు. ఇప్పుడు తెలుగులో సీనియ‌ర్ నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందించిన డ‌ర్టీ హ‌రిని ఈ శుక్ర‌వారం ఆన్ లైన్ థియేట‌ర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికైతే పెద్ద‌గా బ‌జ్ క‌నిపించ‌ట్లేదు. ఇందులోని బోల్డ్ కంటెంట్ చూసి ఏమైనా కుర్రాళ్లు ఎగ‌బ‌డ‌తారేమో చూడాలి.