బాలు గురించి ఎందుకీ ఆత్రం?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లే అయి మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. నిన్న ఉన్నట్లుండి ఆయన ఆరోగ్య పరిస్థితి తారుమారైంది. మొన్నటి వరకు బాలు కోలుకుంటున్నారు.. త్వరలోనే ఆసుపత్రి నుంచి బయటికి వస్తారు అని అప్ డేట్లు వింటూ వచ్చాం. కానీ ఒక్క రోజు వ్యవధిలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆయన పరిస్థితి విషమించింది.

లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారాయన. వైద్యుల ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. గురువారం రాత్రి వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కమల్ హాసన్.. దీన వదనంతో బయటికి వచ్చారు. బాలు బాగున్నారని చెప్పలేనంటూ ఆయన పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పేశారాయన. ఇక అప్పట్నుంచి ఏ క్షణాన దుర్వార్త వినాల్సి వస్తుందో అని బాలు అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఐతే వారి ఆందోళనను పెంచేలా కొన్ని మీడియా సంస్థలు.. కొందరు నెటిజన్లు అప్ డేట్స్ ఇస్తుండటం విచారకరం. నిన్న రాత్రే బాలు చనిపోయినట్లుగా ‘రిప్’ మెసేజ్‌లు తయారైపోయాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్‌ల్లో అప్పుడే అవి హల్‌చల్ చేసేస్తున్నాయి. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్.. నిన్న సాయంత్రమే ‘బాలు ఇక లేరా’ అని హెడ్డింగ్ పెట్టి స్టోరీ నడిపింది. ఇక శుక్రవారం మధ్యాహ్నం ప్రముఖ నటుడు నరేష్.. బాలు ఆత్మశాంతించాలని పేర్కొంటూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేసేశారు. తర్వాత నెటిజన్లు తిట్టేసరికి.. ఆ ట్వీట్ డెలీట్ చేశారు.

నిజానికి బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన కోలుకోవడం అసాధ్యం. ఆయనకు సంబంధించిన దుర్వార్త ఏ క్షణాన అయినా బయటికి రావచ్చు అన్నది ఆసుపత్రి నుంచి వస్తున్న సమాచారం. కానీ ఇంకా అధికారికంగా ఏ ప్రకటనా చేయకముందే ఈ ఆత్రం ఎందుకన్నది అర్థం కాని విషయం. నిజంగా అధికారిక వార్త బయటికి వస్తే.. క్షణాల్లో పాకిపోతుంది. ఇందులో న్యూస్ ఛానెళ్లకైనా, మరొకరికైనా ఎక్స్‌క్లూజివ్ ఏముంటుంది? అందరికంటే ముందు ‘రిప్’ మెసేజ్ పెట్టి సాధించేదేంది? అధికారిక వార్త బయటికొచ్చే వరకు ఆగితే పోయేదేముంది? ఏదైనా అద్భుతం జరిగి ఆయన కోలుకుంటారో ఏమో అని వేచి చూడొచ్చు కదా?