మైనస్ వంద గురించి బన్నీ నిజాయితీ

మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కేవలం తన మీదే నెగటివిటీ వచ్చిందని హీరో బహిరంగంగా ఒప్పుకోవడం అల్లు అర్జున్ నిజాయితీకి నిదర్శనమని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. నిన్న ఆర్య 20వ వార్షికోత్సవ వేడుకని నిర్మాత దిల్ రాజు ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ అను మెహతా తప్ప ప్రధాన తారాగణం. టెక్నికల్ టీమ్ మొత్తం హాజరయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత జరిగిన కలయిక కావడంతో ఈవెంట్ ని కొత్త రిలీజ్ రేంజ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సుదీర్ఘంగా ప్రసంగించాడు. తొలి చిత్రం గంగోత్రి విజయం సాధించినా సరే తనకు మాత్రం మార్కులు రాలేదని, ఇంకా చెప్పాలంటే మైనస్ వందలో ఉన్నానని, అప్పుడు వచ్చిన ఆర్య ఒకేసారి డబుల్ వంద మార్కులు వేయించి ప్రమోషన్ ఇచ్చిందని తిరిగి తన జీవితంలో మళ్ళీ అంత హై చూడలేదని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడేది సాధించినా ఆర్య ఇచ్చిన కిక్ ముందు అవన్నీ బోనస్ గా ఫీలవుతాను తప్పించి మరేమి కాదని స్పష్టం చేశాడు. బన్నీ చెప్పింది నిజమే. సోషల్ మీడియా లేని టైంలో గంగోత్రి లుక్స్ మీద బయట ట్రోల్స్ తరహా కామెంట్స్ బలంగా వినిపించాయి.

ఆర్య చూశాకే అందరి నోళ్లు మూతబడ్డాయి. ఒక్క సినిమాకే ఇంత మేకోవర్ చేసుకోవడం చూసి ప్రేక్షకులు షాకయ్యారు. సుకుమార్ విజన్ లోని బలమది. దేవిశ్రీ ప్రసాద్ తప్ప ఆర్యకు పని చేసిన వాళ్లంతా జూనియర్లమేనని చెప్పిన అల్లు అర్జున్ ఇది ఎందరికి లైఫ్ ఇచ్చిందో, ఎందరిని దర్శకులుగా మార్చిందో ఆనందంగా వివరించాడు. అయినా ప్రభాస్, రవితేజలకు దగ్గరకు వెళ్లిన కథ అనుకోకుండా అల్లు అర్జున్ దగ్గరకి రావడం, అది కాస్తా లైఫ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిపోవడం సంథింగ్ స్పెషలని చెప్పాలి. ఆర్య వేసిన పునాదే ఇప్పటి సెన్సేషన్ పుష్ప దాకా బన్నీ సుకుమార్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.