ప్రతినిధి-2.. టార్గెట్ జగనేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట రాజకీయ నేపథ్యం ఉన్న పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2, వ్యూహం, శపథం లాంటి చిత్రాలు వస్తే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం లాంటి సినిమాలు రిలీజయ్యాయి. ఇప్పుడు ‘ప్రతినిధి-2’ పేరుతో మరో పొలిటికల్ మూవీ ప్రేక్షకులను పలకరించబోతోంది.

ముందు ఈ సినిమా ప్రోమోలు చూస్తే పైన చెప్పుకున్న సినిమాలకు కొంచెం భిన్నం అనుకున్నారు. సగటు కమర్షియల్ సినిమాల ఫార్మాట్లోనే సినిమా తీసి.. అందులో అంతర్లీనంగా రాజకీయ అంశాలు జొప్పించారని అనుకున్నారు. కానీ మే 10న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు లాంచ్ చేసిన రిలీజ్ ట్రైలర్ చూస్తే ఆ ఆలోచన మారిపోతుంది.

ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఈ సినిమా తీశారని రిలీజ్ ట్రైలర్లో స్పష్టమైంది. ఇందులో ‘ప్లే బ్యాక్’ మూవీ ఫేమ్ దీపక్ తేజ్ పోషించిన పాత్ర జగన్‌ను తలపిస్తోంది. ‘ప్రతినిధి-2’ ఒక ముఖ్యమంత్రి హత్య చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుండగా.. ఆ చనిపోయిన ముఖ్యమంత్రి కొడుకు పాత్రలో దీపక్ తేజ్ నటించాడు.

తండ్రి చనిపోయినపుడు అందరూ ఆయన స్థానంలో పదవి చేపట్టాలని అడిగితే నాన్న చనిపోయిన పది గంటలకే నన్ను పదవి తీసుకోమంటారేంటి అని అతను ప్రశ్నించడం.. ఆపై కుర్చీలో కూర్చున్నాక మన చేతిలో అధికారం ఉంది కాబట్టి కేసులు అలాగే ఉంటాయి తప్ప ఏ ప్రోగ్రెస్ ఉండదనే డైలాగ్ చెప్పడం.. ముఖ్యమంత్రి హత్య కేసుకు సంబంధించి అతణ్ని పోలీస్ అధికారి ప్రశ్నలడగడం లాంటి సన్నివేశాలు ట్రైలర్లో కనిపించాయి. ఈ పాత్రను చూసి ప్రేక్షకులు జగన్‌తో రిలేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే దాన్ని తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. మరి సినిమాలో ఈ పాత్ర ద్వారా ఇంకెంతగా జగన్‌ను టార్గెట్ చేస్తారో చూడాలి.