దేవీపట్నంలో 144 సెక్షన్…కారణం తెలిస్తే షాక్

సాధారణంగా అల్లర్లు, గొడవలు, మత కలహాలు, ఎన్నికలు జరిగేటపుడు 144 సెక్షన్ విధిస్తుంటారు. ఘర్షణపూరిత వాతావరణంలో ప్రజలు గుమిగూడితే అల్లర్లు మరింత పెరిగే ప్రమాదముందన్న కారణంతోనే నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధిస్తారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత 144 సెక్షన్ ఎత్తివేసి సాధారణ పరిస్థితులు కల్పించడ పరిపాటి. అయితే, విచిత్రంగా ఏపీ చరిత్రలో బహుశా తొలిసారిగా వరద ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సీవీ ప్రవీణ్ ఆదిత్య(ఐఏఎస్) ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి వరదల వల్ల దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రవీణ్ అన్నారు. అంతేకాదు, వరద ముంపు గ్రామాలను సందర్శించేందుకు మీడియా ప్రతినిధులకు సైతం ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం.

దేవీపట్నం పరిధిలోని గ్రామాల్లో వరద ముంపు గ్రామాలలో సహాయక చర్యల్లో పాల్గొనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొనేవారికి 144 సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ప్రజలు బోట్లపై బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత గ్రామాలలోని అధికారులదేనని ప్రవీణ్ స్పష్టం చేశారు. వరద ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులకు తెలియజేస్తామని, అప్పటి వరకు అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా, వరదల కారణంగా నాగార్జున సాగర్ డ్యాం 4 గేట్లు ఎత్తివేయబోతున్నారని, సాగర్ లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని సాగర్ సందర్శనకు పర్యాటకులు రావొద్దని గురజాల ఆర్ డి ఓ పార్థసారథి కూడా ఆదేశాలు జారీ చేశారు. సాగర్ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, ప్రజలు గమనించాలని తెలిపారు.