నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే అనధికార ఆస్తుల సంగతేంటో చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి తన దగ్గర డబ్బు లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడం విశేషం. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. డబ్బుల పంపకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నా దగ్గర చంద్రబాబు లాగా డబ్బులు లేవు. ఆయన దగ్గర ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఉంది. ఆ డబ్బులతోనే ఓట్లు కొనాలని చూస్తున్నాడు. పోలింగ్‌కు ముందు టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బే. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. ఎవరు అధికారంలో ఉంటే మీకు మంచి జరుగుతుతుందో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓటు వేయండి” అని పేర్కొన్నారు.

ఇక 2019 స్టయిల్లోనే ఫ్యాన్ పట్టుకుని ఇది మన గుర్తు అంటూ జనాలకు రిజిస్టర్ చేసే ప్రయత్నం చేసిన జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గుర్తుల గురించి ఎద్దేవా చేశారు.

ఏ తుప్పు పట్టిన సైకిల్ అడ్డు పడినా.. ఏ గాజు పెంకు అడ్డు వచ్చినా, ఎన్ని పువ్వులను కలుపుకుని వచ్చినా, ఏ చెయ్యి ఆపాలనుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఫ్యానుని అడ్డుకోలేరని.. ఇది పేదవాడి భవిష్యత్తు కోసం తిరుగుతున్న ఫ్యాన్ అని జగన్ వ్యాఖ్యానించారు.

తుప్పుపట్టిన సైకిల్‌కు రిపేర్ చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని జగన్ వ్యంగ్యాస్గ్రాలు విసిరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ధైర్యంగా ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదని.. ఇప్పుడు తమదే అని జగన్ పేర్కొన్నారు.