ప్రభాస్ 21.. దీపికకు తోడు ఇంకొకరు

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘రాధే శ్యామ్’ కంటే కూడా దీని తర్వాత అతను చేయబోయే కొత్త చిత్రం మీదే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉందంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే.. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ సినిమాతో అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రభాస్ లాంటి మాస్ హీరో అశ్విన్ లాంటి క్లాస్ డైరెక్టర్‌తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుడితే ఆసక్తికి కొదవేముంది.

ఈ మధ్యే ఈ చిత్ర బృందం ఓ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోందన్నదే ఆ అప్ డేట్. ప్రభాస్-దీపిక జోడీ కడితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. నిజమైన పాన్ ఇండియా అప్పీల్ వస్తుందీ చిత్రానికి.

ఐతే ఈ సినిమా గురించి వార్త రాసిన ఓ న్యూస్ పోర్టల్ దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొనడం పట్ల దీపిక కాస్త ఉడుక్కున్నట్లుగా కనిపించే సరికి ప్రభాస్ విషయంలో ఆమె ఇన్ సెక్యూర్ ఫీలింగ్‌తో ఉందనిపించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ చిత్రంలో మరో కథానాయికకు కూడా చోటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో తన ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుందేమో అని దీపిక ఫీల్ కావచ్చని అంటున్నారు.

కాకపోతే దీపికనే లీడ్ హీరోయిన్ అని.. మరో కథానాయిక పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని.. దీపికలా పెద్ద కథానాయికను కాకుండా ఓ కుర్ర హీరోయిన్ని తీసుకుంటారని అంటున్నారు. త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో వెల్లడిస్తారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ అని.. ‘ఆదిత్య 369’ తరహాలో సాగుతుందని.. ‘క్రిష్’ స్టయిల్లో ఉంటుందని.. ఇంకా ఏవేవో ప్రచారాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ కథ అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల దాకా ఉండొచ్చని సమాచారం.