ఇలాంటి సమయాల్లో తప్పులో కాలేస్తే ఎలా రాహుల్?

అత్యున్నత స్థానాల్లో ఉండే రాజకీయ నేతలు కొన్నిసార్లు ప్రస్తావించే అంశాలు వారి ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు.. వారికున్న పరపతిపైనా ప్రశ్నలు లేవనెత్తుతుంది. జాతీయవాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విమర్శలు.. ఆరోపణలు అన్ని ఇన్ని కావు. మారిన దేశ ప్రజల మనోగతాన్ని గుర్తించటంలో ఆ పార్టీ చేసిన తప్పులు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. జరిగిన తప్పులేవో జరిగిపోయాయి. ఇప్పటికి ఆ తప్పుల్ని సరిదిద్దుకునే విషయంలో ఆ పార్టీ తడబడుతోంది.

దీనికి నిదర్శనంగా తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని చెప్పొచ్చు. చైనా సైనికుల చేతిలో మన సైనికులు మరణించటం.. వారి కిరాతక చర్యకు బలి కావటం దేశ వాసుల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాన్ని తప్పు పట్టే కన్నా.. కిరాతకానికి కారణమైన వారిని నిలదీయాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ ప్రభుత్వం ఘోరంగా విఫలమైతే.. ఆ విషయాన్ని చాలా సున్నితంగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా రాహుల్ తప్పుల మీద తప్పులు చేయటం విస్మయానికి గురి చేస్తోంది.

మన సైనికులు నిరాయుధులుగా వెళ్లి వీరమరణం పొందారని.. అందుకు బాధ్యులు ఎవరంటూ రాహుల్ ప్రశ్నిస్తున్నారు. భారత సైనికుల్ని చంపటం ద్వారా చైనా పెద్ద నేరానికి పాల్పడిందంటూ ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ సందేశంలో చైనా దురాగతాన్ని ప్రశ్నించటం బాగానే ఉన్నా.. మన సైనికులు నిరాయుధులుగా వెళ్లారంటూ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో తప్పులో కాలేశారని చెబుతున్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందిస్తూ.. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే బలగాల వద్ద ఆయుధాలు ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో విధులు నిర్వహించే బలగాల వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయని.. కానీ 1996లోనూ 2005లోనూ కుదిరిన ఒప్పందం ప్రకారం సరిహద్దులో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఇరు వర్గాలు ఆయుధాలు వాడరని పేర్కొన్నారు.

ఇలాంటి సాంకేతిక అంశాల విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడటం రాహుల్ స్థాయికి సరికాదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే.. తన టీంలోని వారిని సంప్రదించి మాట్లాడితే బాగుండేదన్న సూచన వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న భావోద్వేగ సమయంలో ఇలాంటి తప్పులు ఆయనకే కాదు.. ఆయన పార్టీకి మంచిది కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.