పాగ‌ల్ క‌థ విని ఏడ్చేసింద‌ట‌

ఈ వారం స‌డెన్‌గా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా పాగ‌ల్‌. విశ్వ‌క్సేన్‌ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలి రూపొందించిన చిత్ర‌మిది. దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్ నిర్మించారు. శ‌నివారం పాగ‌ల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్ర హీరోయిన్ల‌లో ఒక‌రైన నివేథా పెతురాజ్ మీడియాతో మాట్లాడింది. పాగ‌ల్ క‌థ వింటున్న‌పుడు కొన్ని స‌న్నివేశాల్లో ఉద్వేగానికి గురై ఏడ్చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించింది.

“ఈ కథ రెండేళ్ల ముందే నా ద‌గ్గ‌రికి వచ్చింది. డైరెక్టర్‌ నరేష్‌ కుప్పిలి చెన్నైకి వచ్చి నాకు కథ వినిపించాడు. వినగానే స్క్రిప్టుతో బాగా కనెక్ట్‌ అయిపోయాను. దిల్ రాజు గారికి కూడా క‌థ న‌చ్చి నాతో మాట్లాడారు. దీంతో ఈ స్క్రిప్టుపై మ‌రింత న‌మ్మ‌కం వ‌చ్చింది. తొలిసారి క‌థ వినిపించాక‌.. ఆపై మ‌రో నాలుగుసార్లు క‌థ విన్నాను. ప్రతిసారీ మొదటిసారిలాగే ఎమోషనల్‌ అయ్యాను. న‌రేష్‌ నాకు కథ చెప్పేటప్పుడు.. కొన్ని సన్నివేశాల్లో నాకు నిజంగానే ఏడుపొచ్చేసి క‌న్నీళ్లు పెట్టుకున్నా” అని నివేథా చెప్పింది.

పాగ‌ల్ సినిమాలో త‌న పాత్ర పేరు ముందు గీత అని పెట్టార‌ని.. ఐతే అందులో ఫీల్ లేద‌ని త‌ర్వాత తీర అని పేరు మార్చార‌ని నివేథా వెల్ల‌డించింది. ‘సఖి’ సినిమాలోలో మాధవన్‌, షాలిని మధ్య ఎలాంటి ఎమోషన్స్‌ ఉంటాయో.. పాగల్ మూవీలో అలాంటి ఎమోషన్స్ ఉంటాయ‌ని నివేథా అంది. ఇక త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి నివేథా మాట్లాడుతూ.. తాను చూడ‌టానికి సీరియ‌స్ అమ్మాయిలా క‌న‌ప‌డ‌తానని.. త‌న‌కు యాటీట్యూడ్‌ ఉందని చాలా మంది అనుకుంటారని.. అందుకు త‌న‌ అప్పీయ‌రెన్స్‌ కారణమై ఉండొచ్చని.. త‌న‌కు వ‌చ్చే పాత్రలు కూడా అలాగే ఉంటున్నాయ‌ని ఆమె అంది.