వెంకీ ఫ్యాన్స్ మామూలుగా లేరు

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ‘నారప్ప’, ‘దృశ్యం-2’ చిత్రాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయబోతుండటం లాంఛనమే అంటున్నారు. ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్‌లో జులై 24న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ‘దృశ్యం-2’ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానున్నట్లు చెబుతున్నారు.

ఐతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెంకీ తన సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయబోతుండటం అభిమానులకు రుచించట్లేదు. వెంకీ ఫ్యాన్స్ మామూలుగా అంత అగ్రెసివ్‌గా ఉండరు కానీ.. ఈ నిర్ణయం పట్ల మాత్రం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వెనుకాడట్లేదు. ముఖ్యంగా మంచి మాస్ మూవీ అయిన ‘నారప్ప’ను ఓటీటీలో వదలడం ఏంటన్నది వాళ్ల అభ్యంతరం.

‘నారప్ప’ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ఉద్యమం చేస్తున్నారు వెంకీ అభిమానులు. వాళ్లు వెంకీని ఏమీ అనట్లేదు కానీ.. నిర్మాత సురేష్ బాబును విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్లు ఆగిన వాళ్లు.. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్న సమయంలో ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘ఎఫ్-2’తో రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టిన హీరో చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం ఏంటని అంటున్నారు.

ఆఫ్ లైన్లో కూడా వెంకీ అభిమానులు తమ నిరసనను చూపిస్తున్నారు. కొందరు అభిమానులు ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్‌ను ఆపాలంటూ నిరాహార దీక్షకు పూనుకోవడం విశేషం. సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఐతే ఈ నిరసనలు చూసి సురేష్ బాబు వెనక్కి తగ్గుతారని అనుకోలేం. నిర్మాతకు తనకు ఏది లాభమో చూసుకుని ఎలా కావాలంటే అలా రిలీజ్ చేసుకునే హక్కు ఆయనకుంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నప్పటికీ మునుపటిలా సినిమాలు ఆడేందుకు సమయం పడుతుందని ఆలోచించే ఆయన ఓటీటీ బాట పట్టినట్లు తెలుస్తోంది.