డేంజరస్ ప్లేస్‌లో నాగార్జున

అక్కినేని నాగార్జున సాహసానికి సిద్ధమయ్యాడు. ఇండియాలోనే మోస్ట్ డేంజరస్ ప్లేస్‌ల్లో ఒకటైన రోహ్‌తాంగ్ పాస్‌లో షూటింగ్‌కు రెడీ అయ్యారు. హిమాలయాల్లోని ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3980 మీటర్లు, 13 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎముకలు కొరికే చలి అంటారు కదా.. అలాంటి ప్రాంతమే ఇది. నవంబరు నుంచి మే వరకు ఈ ప్రాంతాన్ని మూసి వేస్తారు. ఆ ప్రాంతంలో మొత్తం గడ్డ కట్టుకుపోయి ఉంటుంది.

ఐతే ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కొన్ని రోజుల ముందు నాగ్ అండ్ టీం అక్కడ ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ మొదలుపెట్టడం విశేషం. కొన్ని రోజుల కిందటే ‘వైల్డ్ డాగ్’ టీం అక్కడికి చేరుకుంది. చిత్రీకరణ సందర్భంగా నాగ్ అక్కడి నుంచి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాంత విశేషాలను పంచుకున్నారు.

సముద్ర మట్టానికి ఇదెంత ఎత్తులో ఉంటుందో, ఇదెంత ప్రమాదకర ప్రాంతమో వివరించాడు. ఇక్కడ ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ చాలా బాగా జరుగుతోందని చెప్పాడు. ఇంకో 21 రోజుల పాటు తన టీం అంతా ఇక్కడే ఉంటుందని వెల్లడించాడు. తర్వాత తిరిగొచ్చి అందరినీ కలుస్తానని అన్నాడు. వచ్చే నెల నుంచి ఇక్కడ షూటింగ్ సాధ్యం కాదు కాబట్టే నాగ్.. ‘బిగ్ బాస్’ షోను వదిలిపెట్టి అక్కడికి వెళ్లారు. ఆయన లేని నాలుగు వారాల్లో వేరే హోస్ట్ ఈ బాధ్యతలు చూడనున్నారు.

చివరగా నాగ్ గత వారం ఎపిసోడ్లలో కనిపించారు. ఈ వారం కొత్త హోస్ట్‌ను చూడబోతున్నాం. ఆ బాధ్యతను రోజాకు అప్పగించినట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో చూడాలి. ‘వైల్డ్ డాగ్’ విషయానికొస్తే ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన సాల్మన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో నాగ్ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నాడు.