నవంబర్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ?

రానున్న నవంబర్ నెలలో కేంద్రమంత్రి విస్తరణవర్గ ఉంటుందా ? ఏమో వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు చెబుతున్న ప్రకారం అలాగే అనుకోవాల్సుంటుంది. అసలు కేంద్రమంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఏమిటి ? ఇప్పటికిప్పుడు అయితే అలాంటి అవసరం ఏమీ లేదనే అనిపిస్తోంది. ఎన్డీఏలో నుండి అకాలీదళ్ బయటకు వెళ్ళిపోయింది. దాంతో ఆ పార్టీ తరపున మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. దాంతో ఓ మంత్రిపదవిని భర్తీ చేయాల్సిన అవసరం మాత్రమే ఉంది. ఆ ఖాళీని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి భర్తీ చేయాలని అనుకుంటున్నారో లేదో కూడా తెలీదు. ప్రస్తుతానికైతే ఆ బాధ్యతలను వేరే వాళ్ళకు బదాలించారో లేకపోతే తన దగ్గరే అట్టిపెట్టుకున్నారో .

ఇంతోటి దానికి నవంబర్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇంత గట్టిగా తిరుగుబాటు ఎంపి ఎలా చెబుతున్నట్లు ? మంత్రివర్గ విస్తరణ గురించి చెబితే బీజేపీ ఎంపిలో లేకపోతే ఎన్డీఏ పార్టనర్ పార్టీలో చెప్పాలి. వీళ్ళెవరు కాకపోతే మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న అమిత్ షా లాంటి వాళ్ళ నుండైనా విషయం బయటకు లీక్ అవ్వాలి. ఇటువంటి సూచనలు కూడా ఎక్కడా కనబడలేదు. మరి కృష్ణంరాజు విస్తరణ ఉంటుందని ఎలా చెప్పారో ఏమో. సరే మంత్రివర్గ విస్తరణ గురించి పక్కన పెట్టేస్తే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకున్న అక్కసునంతా తిరుగుబాటు ఎంపి తీర్చేసుకుంటున్నారు.

గుడులను కూల్చే పార్టీతో దేవాలయాలు నిర్మించే పార్టీ పొత్తు పెట్టుకోవటం నాన్సెన్స్ అంటూ రెచ్చిపోయారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ సర్కార్ గుడులను కూల్చటమే పనిగా పెట్టుకుందని కూడా మండిపోయారు. నిజానికి తిరుగుబాటు ఎంపి ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో ఒక్క దేవాలయం కూడా కూలలేదు. దేవాలయాల్లోని విగ్రహాలనో లేకపోతే రథాలపై ఒకటి, రెండు చోట్ల దాడులు జరిగిన మాట వాస్తవం. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం రథం దగ్దమైన విషయంపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఇంతోటి దానికే వైసీపీ ప్రభుత్వం గుడులను కూల్చేస్తోందని తిరుగుబాటు ఎంపి ఎలా ఆరోపిస్తున్నారో అర్ధం కావటం లేదు.

ఇదే విషయమై వైసిపి నేతలు మాట్లాడుతూ జరిగిన కొన్ని ఘటనలను పట్టుకుని కృష్ణంరాజు ప్రభుత్వంపై నోరుపారేసుకుంటున్నారంటూ ఎప్పటి నుండో ఎదురుదాడులు చేస్తున్నారు. ప్రభుత్వంలో, నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవటంతో కృష్ణంరాజులో అసహనం పెరిగిపోతోందని ఎంఎల్ఏ కొట్టు సత్యనారాయణ ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపి గా గెలిచిన కృష్ణంరాజు ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లటాన్ని మానుకోవాలంటూ హితవు చెప్పారు. మొత్తానికి బీజేపీ+వైసీపీలు ఎక్కడ కలిసిపోతాయో ? ఎన్డీఏలోకి వైసీపీ ఎక్కడ చేరుతుందో అనే టెన్షన్ కృష్ణంరాజులో బాగా కనిపిస్తోందంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎన్డీఏలో వైసిపి చేరితే వెంటనే తనపై ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అనే టెన్షన్ నిజంగానే ఉందేమో.