ఆ మూడూ గెలవకుంటే .. మూడు ముక్కలాటే !

మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ కు తప్పనిసరి అవసరంగా మారింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో, రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లి నాగర్ కర్నూలు పరిధిలో ఉండగా సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు మల్కాజ్ గిరి నుండి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అందరి చూపులు ఆ నియోజకవర్గాల మీదే ఉన్నాయి.

తెలంగాణలో 17 సీట్లకు గాను 14 లోక్ సభ సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నది. మరో వైపు 12 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నది. అయితే రేవంత్ కు మాత్రం పై మూడు స్థానాలు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఏ మాత్రం తేడా వచ్చినా సొంత జిల్లాలోనే ఓడిపోయాడని పార్టీలో ప్రత్యర్ధులు ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చికాకులు కల్పించవచ్చని భావిస్తున్నారు.

మల్కాజ్ గరి నుండి కాంగ్రెస్ తరపున జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిని నిలబెట్టారు. అక్కడ ఈటెల రాజేందర్ బీజేపీ తరపున, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం అయిన నేపథ్యంలో అంగ, ఆర్థిక బలాలు పుష్కలంగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణిని ఇక్కడ నిలిపారు. 2019 ఎన్నికలలో ఇక్కడ రేవంత్ కేవలం 10 పై చిలుకు ఓట్లతో మాత్రమే గెలిచాడు. ఈ సారి కూడా అక్కడ ఉన్న ఆంధ్రా సెటిలర్లు కాంగ్రెస్ ఓటు వేస్తారన్న ఆశతో ఉన్నారు.

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో బీజేపీ నుండి డీకె అరుణ, బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుండి చల్లా వంశీ చంద్ రెడ్డిలు మళ్లీ పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి బీజేపీ అభ్యర్థి డీకె అరుణపై 77,829 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి 193631 ఓట్లు మాత్రమే సాధించాడు. ఇప్పుడు అక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీలో ఉన్న జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయాడు. డీకె అరుణ, రేవంత్ ల మధ్య ఇక్కడ మాటల యుద్దం నడుస్తున్నది. ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం అని భావించిన రేవంత్ ఇప్పటి వరకు ఏడు సభలకు హాజరయ్యాడు.

నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏడు శాసనసభ నియోజకవర్గాలలో అయిదింటిలో కాంగ్రెస్, రెండింటిలో బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. ఇక ఎంపీ ఎన్నికలకు ప్రజలు ఎటు వైపు మొగ్గుచూపుతారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక అన్ని చోట్లా కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు ప్రచారంలో నేతలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ రేవంత్ ఈ మూడు స్థానాలను గెలుచుకోవాల్సి ఉంది. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాలి.