ఏక్ష‌ణ‌మైనా.. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. రంగం రెడీ?

దేశ రాజ‌ధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్ర‌మేన‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం.. పైగా ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రం. ఇక్క‌డ ప్ర‌జ‌లు త‌మ ఓటు ద్వారా ప్ర‌భుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే.. ఇక్క‌డి ప్ర‌భుత్వానికి ప‌రిమితం అధికారాలు మాత్ర‌మే ఉంటాయి. లా అండ్ ఆర్డ‌ర్‌ను కేంద్ర హోం శాఖ నియంత్రిస్తుంది. పోలీసుల‌ను.. చివ‌ర‌కు ట్రాఫిక్ పోలీసుల‌ను కూడా.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. ఇలాంటి రాష్ట్రంలో వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న అర‌వింద్ కేజ్రీవాల్‌.. ఢిల్లీ లిక్కర్ కుంభ‌కోణంలో చిక్కుకుని జైల్లో ఉన్నారు.

ఇప్ప‌టికే నెల రోజులు అవుతున్న ద‌రిమిలా.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు దారితీసే ప‌రిణాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌.. స‌క్సేనా.. ఇక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలంటూ.. సిఫారసు చేశారు. కానీ.. ఢిల్లి లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి.. జైల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి మాత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయ‌లేదు. దీంతో ఇక్క‌డ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుగానే రికార్డులు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో జైల్లో ఉన్న కేజ్రీవాల్‌తో రాజీనామా చేయించాల‌ని.. ప‌లువురు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. దీనిని కోర్టులు తిర‌స్క‌రించాయి. అలా ఆదేశించే హ‌క్కు కోర్టుల‌కు లేద‌ని తేల్చి చెప్పాయి.

కానీ.. త‌ద‌నంత‌రం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. కేజ్రీవాల్‌ను బ‌ల‌వంతంగా రాజీనామా చేయించేలా వ్యూహాత్కంగా తెర‌వెనుక పావులు క‌దులుతున్నాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు… ఇక‌, కేజ్రీవాల్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని క‌ల్పిస్తున్నాయి. ఇంకా స్కూళ్లు తెర‌వ‌లేదు. మ‌రో నెల రోజుల‌పాటు స‌మ్మ‌ర్ సెల‌వులు ఉన్నాయి. కానీ, బీజేపీకి చెందిన ఓ కార్య‌క‌ర్త ఢిల్లీ కోర్టులో పిటిష‌న్ వేశారు. ముఖ్య‌మంత్రి అందుబాటులో లేని కార‌ణంగా పిల్ల‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. స్కూళ్లు తెరిచే స‌మ‌యానికి వారికి అందాల్సిన పుస్త‌కాలు.. బ్యాగులు, ఇత‌రత్రా వ‌స్తువులు అంద‌లేద‌ని తెలిపారు.

దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. “సీఎంగా వున్న వ్య‌క్తి అజ్ఞాతంలో ఉంటే కుద‌ర‌దు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి. అలా చేత‌కాక‌పోతే.. వేరే ప్ర‌త్యామ్నాయం చూసుకోవాలి” అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాల‌కు దారితీస్తున్న సంకేతాలు దాదాపు ఇచ్చిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. హైకోర్టు వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా మ‌రోసారి.. తాజాగా కేంద్రానికి రాష్ట్ర‌ప‌తిపాల‌న‌పై సిఫార‌సు చేశారు. ఈ నేప‌థ్యంలో ఏ క్ష‌ణ‌మైనా ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వం కూలిపోయి.. రాష్ట్ర‌ప‌తి పాల‌న వ‌చ్చే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.