కొత్త సినిమాలొచ్చినా నీరసం తప్పలేదు

కొత్త సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ కు ఎలాంటి ఉత్సాహం కలగడం లేదు. కారణం కనీసం యావరేజ్ అనిపించుకున్నవి కూడా లేకపోవడమే. నిన్న రిలీజైన వాటిలో విశాల్ ‘రత్నం’ ఒక్కటే అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టిలో ఉంది. కానీ రొట్ట రొటీన్ అనిపించే కథా కథనాలతో దర్శకుడు హరి ఆడియన్స్ ని పరిగెత్తించడంతో దీని ఫలితమేంటో మొదటి ఆటకే అర్థమైపోయింది. పర్వాలేదనిపించుకున్నా వీకెండ్ వసూళ్లు దక్కేవి. కానీ చేతులారా పోగొట్టుకుంది. తమిళంలో రెస్పాన్స్ ఓ మాదిరిగా ఉందంటున్నారు కానీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినా గొప్పే అనుకోవాలి.

విడుదలైన ఊసే లేకుండా వచ్చిన చిన్న సినిమా ‘జర హట్కే’ని ఎవరూ పట్టించుకోలేదు. కనీస టాక్ లేదు. కొత్త జనరేషన్ ఫిలిం మేకింగ్ మీద ఏదో కొత్తగా ట్రై చేశారు కానీ ట్రైలర్ దశ నుంచే ఆసక్తి రేపడంలో మేకర్స్ ఫెయిలయ్యారు. ఇక హాలీవుడ్ మూవీ ‘ఘోస్ట్ బస్టర్స్ ఫ్రోజెన్ ఎంపైర్’కు వచ్చిన స్పందన అంతంత మాత్రమే. స్కూళ్ల సెలవులు కాబట్టి పిల్లలు ఎగబడతారేమో అనుకుంటే ఆ సూచనలేమీ కనిపించలేదు. ‘అబిగైల్’ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. భారీ బడ్జెట్ తో సౌత్ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన హిందీ చిత్రం ‘రుస్లాన్’ సైతం నెగటివిటీ టాక్ మూటగట్టుకుంది.

ఇన్ని ప్రతికూలతల మధ్య ఎన్ని థియేటర్లలో ఎన్ని షోలు క్యాన్సిల్ అయ్యాయో చెప్పడం కష్టమనేలా ఉంది. గత వారం వచ్చినవి కూడా పూర్తిగా నిరాశపర్చడంతో ఎగ్జిబిటర్లు పాత సినిమాలనే నమ్ముకుంటున్నారు. అంతో ఇంతో ఆక్యుపెన్సీ లాగుతున్న టిల్లు స్క్వేర్ నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ ఎప్పుడో సెలవు తీసుకున్నాడు కాబట్టి దాని మీద ఆశలేం లేవు కానీ మే 3న రాబోయే ప్రసన్నవదనం, ఆ ఒక్కటి అడక్కు, శబరి, బాక్ అరణ్మయి 4 మీదే మూవీ లవర్స్ భారమంతా. చూడాలి మరి వీటిలో రెండో మూడో ఊపిరి పోస్తాయో లేదో.