ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం


ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం లేద‌ని.. దానికి స‌రైన ఎలివేష‌న్ ద‌క్క‌లేద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతుంటారు. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రిగింది. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లు గ‌డిచిపోయింది. అంద‌రూ ఆ టాపిక్ ప‌క్క‌న పెట్టేశారు.

కానీ రాజ‌మౌళి ఇప్పుడు బాహుబ‌లి: ది క్రౌన్ ఆఫ్ బ్ల‌డ్ యానిమేష‌న్ సిరీస్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ ప్రెస్ మీట్‌కు హాజ‌రైతే అక్క‌డ కూడా సంద‌ర్భం చూడ‌కుండా ఈ అంశం మీద ప్ర‌శ్న అడిగి ఆయ‌న్ని అస‌హ‌నానికి గురి చేశారు మ‌న విలేక‌రులు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరో పాత్రే ఎలివేట్ అయింది, ఇంకోదానికి ప్రాధాన్యం త‌గ్గిందనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి, దీనిపై మీరేమంటారు అంటూ అసంద‌ర్భ ప్ర‌శ్న అడిగారు. దీనికి రాజ‌మౌళి స‌మాధానం చెప్ప‌కుండా ఇది స‌రైన వేదిక కాదు అని ఊరుకున్నారు.

ఇలాగే జ‌క్క‌న్న‌ను ఇరుకున పెట్టేలా మ‌రి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను కూడా మ‌న మీడియా ప్ర‌తినిధులు అడిగారు. వాటికి రాజ‌మౌళి కొంచెం సున్నితంగానే స‌మాధానాలు ఇచ్చారు. ఇక బాహుబ‌లి: ది క్రౌన్ ఆఫ్ బ్ల‌డ్ గురించి మాట్లాడుతూ.. ఇది బాహుబ‌లికి సీక్వెలూ కాదు, ప్రీక్వెలూ కాద‌ని రాజ‌మౌళి స్ప‌ష్టం చేశాడు.

బాహుబ‌లి అస‌లు క‌థ మ‌ధ్య‌లో ఏం జ‌రిగి ఉంటుంద‌నే ఊహ‌తో ఈ క‌థ న‌డుస్తుంద‌ని.. ఇందులో చాలా హైలైట్లు ఉన్నాయ‌ని.. ముఖ్యంగా బాహుబ‌లి, క‌ట్ట‌ప్ప త‌ల‌ప‌డే స‌న్నివేశాలు భ‌లేగా ఉంటాయ‌ని రాజ‌మౌళి తెలిపాడు. హాలీవుడ్ ద‌ర్శ‌కుల్లా త‌న‌కూ యానిమేష‌న్ మూవీస్ చేయాల‌ని ఉంద‌ని.. ఈగ అందులో భాగ‌మే అని.. భ‌విష్య‌త్తులో పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని జ‌క్క‌న్న తెలిపాడు.