జగన్‌కు వివేకా భార్య బహిరంగ లేఖ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఇప్పటికే ఆయన తనయురాలు సునీత, ఆయన అన్న కూతురు షర్మిళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద ఎలా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారో తెలిసిందే. దీనికి జగన్, అవినాష్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. కానీ వివేకా హత్య అంశం రోజు రోజుకూ బలమైన రాజకీయ అంశంగా మారుతున్న నేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చారు.

వివేకా హత్య విషయమై ఏపీ సీఎం జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఓవైపు జగన్ తన ఎన్నికల ప్రచారంలో వివేకా రెండో పెళ్లి గురించి ప్రస్తావించిన రోజే ఆమె ఈ లేఖ రాశారు. చెప్పలేని విధంగా వివేకా వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ ఆమె జగన్ తీరును తప్పుబట్టారు.

‘‘2009లో నీ తండ్రిని కోల్పోయినపుడు ఎంత మనో వేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం.. వాళ్లకు నువ్వు రక్షణగా ఉండడం ఎంతో బాధించింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయడం నీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడే స్థాయికి దిగజారుతున్నారు. ఇదంతా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిళనూ టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమేంటి? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఎంతమాత్రం మంచిది కాదు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలవాలని వేడుకుంటున్నా’’ అని ఈ లేఖలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు.