పేద‌ల‌కు 2 నుంచి 3 సెంట్ల స్థ‌లం ఉచితం: బాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సమ‌యం చేరువ అవుతున్న కొద్దీ.. పార్టీల మ‌ద్య పోటీ కూడా అంతే తీవ్రంగా మారుతోంది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇచ్చే హామీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికేసూప‌ర్ సిక్స్‌ వంటి కీల‌క ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల ముందు వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా మ‌రో సంచ‌ల‌న హామీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే.. పేద‌ల‌కు 2 సెంట్ల నుంచి 3 సెంట్ల భూమి ఇస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. స్థలంలో పునాదుల నుంచి రూఫ్ వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే క‌ట్టి ఇస్తుంద‌ని చెప్పారు. ఇది త‌న హామీ అని ప్ర‌క‌టించారు.

తాజా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. కాకినాడ నుంచి ఎంపీ అభ్య‌ర్తిగా జ‌న‌సేన నాయ‌కుడు ఉద‌య్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జ‌గ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వీరిరువురును చెరోప‌క్క‌నా నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. జగన్ చేసేదంతా విధ్వంసమేనని, వ‌చ్చీరావ‌డంతోనే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా అన్నింటినీ ధ్వంసం చేశాడ‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

ఇప్ప‌టికే తాము ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌పై మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పిన చంద్ర‌బాబు.. వారి నుంచి కూడా తాము కొంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. దీని ప్ర‌కారం.. చాలా మంది పేద‌లు త‌మ‌కు స్థ‌లం కావాల‌ని కోరుతున్నా ర‌ని.. ఈ సైకో ఇచ్చిన బాత్ రూం వంటి స్థ‌లంలో ప‌డుకోవ‌డానికి కూడా చోటు స‌రిపోవ‌డం లేద‌ని అన్నార‌ని.. కాబ‌ట్టి తాము అధికారంలోకి రాగానే పేద‌ల‌కు 2 నుంచి 3 సెంట్ల భూమిని ఇస్తామ‌న్నారు. వారికి ఇల్లు కూడా క‌ట్టించి ఇస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలను అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.