వ్య‌తిరేక‌త అర్థ‌మ‌వుతోందా జ‌గ‌న్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీకి తిరుగేలేదు? ఈ సారి 175 సీట్లు గెలుస్తాం అనే అతివిశ్వాసంతో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాగుతున్నారా? క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు వ్య‌తిరేకంగా మారినా అర్థం చేసుకోవ‌డం లేదా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

తాజాగా బ‌స్సుయాత్ర‌లో వివిధ వ‌ర్గాల నుంచి ఎదుర‌వుతోన్న అసంతృప్తి సెగ‌, వ్య‌తిరేక‌తే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా కాకినాడ‌లో కాలేజీ విద్యార్థులు జ‌గ‌న్ ముందే ప‌వ‌న్‌కు జిందాబాద్ కొడుతూ, వైసీపీపై విమ‌ర్శ‌లు చేశారు. ఈ సంఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సెన్సేష‌న‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌తో సీఎం జ‌గ‌న్‌పై, అధికార వైసీపీపై ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉందో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ ఒక్క చోటులోనే కాదు జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ఎక్క‌డికి వెళ్లినా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంద‌ని చెబుతున్నారు. కానీ ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ఒప్పుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఒక‌వేళ ఈ వ్య‌తిరేక‌త అర్థ‌మైనా బ‌య‌ట‌కు మాత్రం చూపించట్లేదని అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా రాయి దాడి జ‌గ‌న్‌కు ఎలాంటి మైలేజీ ఇవ్వ‌లేక‌పోయింద‌నే టాక్‌.

గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు ఇలాగే కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కానీ దాన్ని పట్టించుకోకుండా, త‌న‌కు ఓట‌మి ఉండ‌ద‌నే ధోర‌ణితో సాగిన కేసీఆర్‌కు ఓట‌ర్లు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఈ వ్య‌తిరేక‌త‌ను కాస్త అర్థం చేసుకున్న జ‌గ‌న్‌.. కొన్ని చోట్ల సిటింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చారు. కానీ అది స‌రిపోతుందో లేదో సమయమే చెప్పాలి