చిరంజీవిపై విమర్శల దాడి చేస్తే వైసీపీకేంటి లాభం.?

వైసీపీ అసహన రాజకీయాలకు ఇదొక నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీద దారుణాతి దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగారు. వైసీపీ కీలక నేత అయితే, ‘సింగిల్ సింహం’ అని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అపారమైన స్వామి భక్తిని చాటుకునే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని జంతువులతో పోల్చుతున్నారు. ఆ జంతువుల్లో హైనా తదితర పేర్లనూ ప్రస్తావించడం అత్యంత శోచనీయం.

రాజకీయమన్నాక విమర్శలు సహజం. వాటికీ ఓ హద్దుండాలి. రాజకీయమంటే ప్రజా సేవ అన్న ప్రాథమిక సూత్రాన్ని వైసీపీ విస్మరిస్తోంది. అయినా, చిరంజీవి ఏమన్నారు.? తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులకు రాజకీయంగా మద్దతు పలికారు. అందులో ఒకరు జనసేన నేత, ఇంకొకరు బీజేపీ నేత.

తనను కలిసిన ఆ ఇద్దరు నాయకులకూ చిరంజీవి మద్దతిచ్చారు. అదే వైసీపీ దృష్టిలో నేరం. వై నాట్ 175 అంటోంది వైసీపీ. అలాంటప్పుడు, ఎవరు ఎవరికి మద్దతిస్తే వైసీపీకి వచ్చిన నష్టమేంటి.? ఏమీ వుండదు కదా.? వైసీపీ కూడా గతంలో చాలామంది సినీ ప్రముఖుల మద్దతు తీసుకుంది. అది తప్పు కానప్పుడు, అది నేరం కానప్పుడు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి ఎవరైనా మద్దితిస్తే దాన్ని నేరంలా వైసీపీ ఎందుకు చూస్తోంది.?

ఇంతా చేసి, వైసీపీకి ఒనగూడే లాభం ఏమైనా వుంటుందా.? అంటే, అదీ లేదు.! మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికినప్పుడు, వైసీపీ నేతలంతా ఆయన్ని అభినందించారు. ‘చిరంజీవి మావాడు’ అని చెప్పుకున్నారు వైసీపీ నేతలు. ‘సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అపారమైన ప్రేమ చిరంజీవికి’ అని కూడా చెప్పుకున్నారు.

ఇప్పుడేమో, చిరంజీవిని తూలనాడుతున్నారు, కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారు కూడా.! ఈ తరహా రాజకీయాలు వైసీపీకి చేటు చేస్తాయి. చిరంజీవిని అభిమానించేవారి ఓట్లు వైసీపీకి అస్సలు పడవనే పరిస్థితిని వైసీపీ కొనితెచ్చుకుందిప్పుడు.!