అరవింద్ మాటల వెనుక అంతరార్థం ఏంటి ?

‘’తెలంగాణలో బీజేపీతో కొట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ ఎన్నడూ కొట్లాడింది లేదు. తన పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కరంట్ సరఫరా చేశానని ఓట్లడిగే హక్కు ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉన్నది’’ అంటూ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

అదే సమయంలో ‘’కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక ఎజెండా అంటూ లేదని, దేశాన్ని విభజించి నాశనం చేసిందని,  ఇప్పుడు ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ తీసేస్తాం అంటున్నారని, సీఏఏను ఎందుకు విమర్శిస్తున్నారో అర్ధం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి అస్సలు ఓట్లడిగే నైతిక అర్హత లేదని’’ అరవింద్ చెప్పడం గమనార్హం. ఇక తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయం ప్రస్తావిస్తూ ‘‘అది ప్రైవేట్ ఇష్యూ .. దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారో అర్థం కాదు’’ అన్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

2019 ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుండి కేసీఆర్ కూతురు కవిత మీద అరవింద్ గెలిచారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత ఐదేళ్లుగా కేసీఆర్ పాలన మీద, కవిత మీద అరవింద్ నిరంతరం మాటలదాడితో హాట్ టాపిక్ గా మారాడు. లిక్కర్ పాలసీ కేసులో కవిత మీద అరవింద్ అనేక ఆరోపణలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈడీ కేసులో అరెస్టయిన కవిత తీహార్ జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో హఠాత్తుగా అరవింద్ కేసీఆర్ మీద ప్రశంసలు కురిపించడం, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. ఈ ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుండి బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. తన సామాజిక వర్గానికే చెందిన బాజిరెడ్డిని బరిలో దింపడం మూలంగా అరవింద్ కు చెక్ పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. 

గత ఎంపీ ఎన్నికలలో జీవన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ ఓట్లు క్రాస్ ఓటింగ్ జరగడం మూలంగానే అరవింద్ ఎంపీగా గెలిచాడు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి స్వయంగా జీవన్ రెడ్డి బరిలో దిగడంతో ఆ ఓట్లు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. ఇక శాసనసభ ఎన్నికలలో కోరుట్ల నుండి పోటీ చేసి అరవింద్ ఓటమి పాలయ్యాడు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో తప్పనిసరిగా గెలవాలన్న ప్రయత్నంలో కేసీఆర్ మీద ప్రశంసలతో బీఆర్ఎస్ ఓట్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాఖ్యలు అని విశ్లేషకులు బావిస్తున్నారు.