జ‌నాల్లోకి కేసీఆర్‌.. బ‌స్సుయాత్ర‌తో బాగుప‌డేనా?

ఓ వైపు పార్టీలో నుంచి నాయ‌కుల జంపింగ్‌లు.. మ‌రోవైపు వివిధ కార‌ణాల‌తో పార్టీపై వ్య‌తిరేక‌త‌.. కార్య‌క‌ర్త‌ల్లో, జ‌నాల్లో పార్టీపై పోతున్న న‌మ్మ‌కం.. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు బ‌స్సుయాత్ర‌ను మార్గంగా ఎంచుకున్నారు. ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బ‌స్సుయాత్ర చేస్తార‌ని బీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నిక‌ల‌ సంఘాన్ని కోరింది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు ఈ బ‌స్సు యాత్ర తెలంగాణ‌లో సాగుతుంది. దీనికి సంబంధించిన వివ‌రాల‌న్నింటినీ రాష్ట్ర ఎన్నిక‌ల ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్ తెలియ‌జేసింది. అలాగే కేసీఆర్‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కూడా కోరింది. ఇక కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాలే ప్ర‌ధాన అస్త్రాలుగా కేసీఆర్ బ‌స్సుయాత్ర నిర్వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. ఈ బ‌స్సుయాత్రలో భాగంగా ఉద‌యం పూట ఎండిన పంట‌పొలాల‌ను, ధాన్యం క‌ల్లాల‌ను కేసీఆర్ సందర్శిస్తార‌ని తెలిసింది. సాయంత్రం బ‌స్సు యాత్ర కొన‌సాగుతుంది. బ‌హిరంగ స‌భ‌ల్లోనూ కేసీఆర్ పాల్గొన‌నున్నారు.

అయితే బీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో తిరిగి న‌మ్మ‌కాన్ని పొందేందుకే కేసీఆర్ జ‌నాల్లోకి వెళ్తున్నార‌ని టాక్‌. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో కేసీఆర్‌కు షాక్ త‌గిలింది. ఈ స‌మ‌యంలోనే తుంటి మార్పిడి శ‌స్త్రచికిత్స కార‌ణంగా కేసీఆర్ బ‌య‌ట‌కు రాలేదు. ఇటీవ‌ల ఆయ‌న పొలంబాట ప‌ట్టి కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల్లో ప‌దును పెంచారు. అయితే కేసీఆర్ ఎంత చేస్తున్నా బీఆర్ఎస్‌కు మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఆ పార్టీ నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరుతూనే ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత అరెస్టు, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్‌కు న‌ష్టం చేస్తున్నాయ‌నే చెప్పాలి. ఇప్పుడు ఆ పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఒక‌ప్ప‌టిలా కేసీఆర్‌ను జ‌నాలు ఆదరిస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఈ బ‌స్సుయాత్ర‌తో బీఆర్ఎస్ బాగుప‌డుతుందేమో చూడాలి.