గ్రేట‌ర్‌పై ప‌ట్టుకు రేవంత్ ప్లాన్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా పీసీసీ అధ్య‌క్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సాగుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డైతే బ‌ల‌హీనంగా ఉందో గుర్తించి ఆ చోట్ల పార్టీ పుంజుకోవ‌డానికి ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌పై రేవంత్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది కానీ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మాత్రం ఒక్క చోట కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని అసెంబ్లీ స్థానాల్లో అత్య‌ధికంగా బీఆర్ఎస్ ఖాతాలో చేర‌గా.. మ‌రికొన్ని ఎంఐఎం పార్టీకి ద‌క్కాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఒక్క స్థానంలోనూ గెల‌వ‌లేక‌పోయింది. ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ్రేట‌ర్‌లో బ‌లం పెంచుకోవడానికి రేవంత్ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇక్క‌డ బీఆర్ఎస్ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే ఖైర‌తాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అలాగే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ విజ‌య‌లక్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌తా శోభ‌న్‌రెడ్డి కూడా హ‌స్తం కండువా క‌ప్పుకున్నారు. ఇక ఇప్పుడు రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్ కూడా కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

రాజేంద్ర‌న‌గ‌ర్ నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచిన ప్ర‌కాశ్‌గౌడ్ త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు. గ్రేట‌ర్‌లో ప‌ట్టు పెంచుకోవాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్న రేవంత్ ఆ దిశ‌గా బీఆర్ఎస్ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మొత్తం నాలుగు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల‌, మ‌ల్కాజిగిరి స్థానాల్లో పోరు హోరాహోరీగా మారింది. హైద‌రాబాద్‌లో ఎంఐఎం, సికింద్రాబాద్‌లో బీజేపీ, చేవెళ్ల‌లో బీఆర్ఎస్‌, మ‌ల్కాజిగిరిలో కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాయి. ఇప్పుడు మ‌ల్కాజిగిరిని కాపాడుకోవ‌డంతో పాటు మిగ‌తా చోట్ల కూడా విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ చూస్తోంది.