నామినేషన్లలో ఆ ‘ముగ్గురు’.! హిట్టు కూటమికి సంకేతమిదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. వారి వారి జాతక రీత్యా, సుముహూర్తం చూసుకుని మరీ భారీ ర్యాలీలతో నామినేషన్లను దాఖలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కూటమి అభ్యర్థుల ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి కూటమిగా ఏర్పడి, అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. సీట్ల పంపకాల విషయమై కొంత గందరగోళం నడిచినా, నామినేషన్ల పర్వం షురూ అయ్యేసరికి, ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలూ లేకుండా పోయాయ్.

జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, మూడు పార్టీల శ్రేణులూ ఆయా ర్యాలీల్లో పాల్గొంటుండడం గమనార్హం. కూటమి అభ్యర్థులు మూడు పార్టీల జెండాలతో హంగామా సృష్టిస్తున్నారు. పార్టీ శ్రేణులదీ అదే తీరు.

కూటమి ఏర్పాటవడం గొప్ప కాదు.. కూటమిలో పార్టీల మధ్యన ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది అత్యంత కీలకం. అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సింబల్, లోక్ సభ నియోజకవర్గానికి మరో సింబల్.. ఇలా సైకిల్, గ్లాస్, కమలం మధ్య పార్టీ కార్యకర్తలే పోలింగ్ సమయంలో గందరగోళానికి గురయ్యే అవకాశం వుంటుంది మామూలుగా అయితే.

ఆ గందరగోళానికి అస్సలేమాత్రం తావు లేకుండా, కూటమి అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు, ప్రజల్లోనూ ఎన్నికల గుర్తుల విషయమై చైతన్యం కల్పిస్తూ, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుండడం గమనార్హం.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా.. అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థుల నామినేషన్ పండగ వాతావరణంలో జరుగుతోంది. ఇది ‘హిట్టు కూటమి’ అని మూడు పార్టీల శ్రేణులు చెప్పడమే కాదు, ప్రజల్లోనూ ఆ వేవ్ తీసుకొచ్చేందుకు ఈ నామినేషన్ల పర్వం ఉపయోగపడుతోందనే చెప్పాలి.