జ‌గ‌న్ వైపా..  సునీత వైపా.. తేల్చుకోవాల్సిన స‌మ‌యం

“న‌ర‌హంత‌కుల‌కు కొమ్ముకాసే.. సీఎం జ‌గ‌న్ వైపా.. తండ్రిని పొట్ట‌న పెట్టుకున్న‌వారిపై వీర నారిగా, రుద్ర మ దేవిగా పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత వైపా.. తేల్చుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. మిమ్మ‌ల్ని చంపేసి.. మీ కుటుంబంపైనే హ‌త్య‌ను మోపుతారు. ఆలోచించుకుని ఓటేయండి” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభకు హాజరయ్యారు.

“బాబాయ్ ని చంపింది ఎవరు?  దారుణ హ‌త్య‌లో ముద్దాయి అవినాష్‌ రెడ్డిని పక్కన పెట్టుకుని, వైఎస్సార్ సమాధి సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారు. తనకు న్యాయం చేయాలని సునీత కోరుతున్నారు. ఓ ఆడబిడ్డ ఆవేదన విన్నారు కదా. జగన్ కు సపోర్ట్ చేస్తారా? సునీతకు సపోర్ట్ చేస్తారా?” అని చంద్రబాబు స్థానికుల ను ప్ర‌శ్నించారు.

“హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదని చెబుతున్నాం. నిన్న(బుధ‌వారం సీఎం జ‌గ‌న్‌) నంగనాచిలా మాట్లాడా డు. ఇప్పుడు మనం కదిరిలో ఉన్నాం… పక్కనే పులివెందుల ఉంది. పులివెందులలో గొడ్డలివేటు వేస్తే కదిరికి వినిపిస్తుందా, లేదా? ఆ గొడ్డలి ఇక్కడే తయారైందని వార్తలు వచ్చాయి. నిన్న చెబుతున్నాడు… కలియుగంలో నాపై ఆరోపణలు చేస్తున్నారు, నాకేమీ అర్థం కావడంలేదు, మా చిన్నాన్నను చంపేశారు అంటూ మళ్లీ మొదటికొచ్చాడు డ్రామారాయుడు, కరకట్ట కమలహాసన్” అంటూ సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు స‌టైర్లు వేశారు.

బాబాయ్ ని చంపింది ఎవరో ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసని అన్నారు. “కానీ జగన్ ఏమంటున్నాడో తెలుసా… బాబాయ్ ని చంపింది ఎవరో దేవుడికే తెలుసు, నేను ఏ తప్పు చేయలేదు అని చెబుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలా?  సునీత.. జగన్ కు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆమె ఆవేదన విన్న తర్వాత మనసున్న వాళ్లు ఏంచేస్తారు? ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి, మళ్లీ ఆ నేరాలను మనపై నెట్టాలనుకుంటున్నాడు.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.