గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా – రిస్కా సేఫా

వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి వెళ్లిపోయింది. కారణాలు పైకి చెప్పలేదు కానీ యూనిట్ నుంచి ఆఫ్ ది రికార్డు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నికలు సోమవారంతో పూర్తవుతాయి. అయినంత మాత్రాన జనాలు వెంటనే సినిమాల మూడ్ కు వచ్చేస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా కేవలం పది రోజుల్లో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లడం జరగని పని. నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్ష ప్రచారంలో భాగం కావడంతో సితార వ్యవహారాలు చూసుకోవడానికి కొంచెం బ్రేక్ ఇచ్చారు.

దీంతో హడావిడితో రిలీజ్ చేయడం కన్నా కూల్ గా పోస్ట్ పోన్ చేద్దామనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయినా ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనేది తెలిసే నాలుగు రోజుల ముందు గ్యాంగ్స్ అఫ్ గోదావరిని రిలీజ్ చేయడం కొంచెం రిస్క్ అనిపించే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే టిడిపి జనసేన వచ్చినా లేక వైసిపి కొనసాగినా ఆ సంబరాలు కనీసం ఒక వారం పాటు పబ్లిక్ లో హంగామా చేస్తాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా థియేటర్లకు రావడమనేది అనుమానమే. అసలు మే 17 లాంటి మంచి డేట్ ని వదిలేసుకోవడం ఏమిటనే కామెంట్స్ విశ్వక్ సేన్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.

ఇంకా కథ వేరే ఉంది. మే 31 మూడు సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. సుధీర్ బాబు హరోంహర, కాజల్ అగర్వాల్ సత్యభామ, అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తిలు షెడ్యూల్ చేసుకుని ఆ మేరకు పబ్లిసిటీ కూడా చేసుకున్నాయి. ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరి హఠాత్తుగా రంగంలోకి దిగడంతో వీటిలో ఒకటో రెండో తప్పుకునే పరిస్థితి రావొచ్చు. పోనీ ఇప్పుడు విశ్వక్ టీమ్ వదిలేసిన మే 17 తీసుకుందామన్నా వాళ్లకూ ప్రమోషన్ టైం సరిపోదనే ఫిర్యాదే వస్తుంది. మొత్తానికి వాయిదాల మీద వాయిదాలతో లంకల రత్నం (విశ్వక్ పాత్ర పేరు) విపరీతంగా ఎదురు చూసేలా చేస్తున్నాడు.