వీరమల్లు హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్టు

నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని మీద ఆసక్తినే తగ్గించుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా దీని మీద మాములు అంచనాలు ఉండేవి కాదు. దర్శకుడు క్రిష్ తీర్చిదిద్దుతున్న విధానం పోస్టర్లు, బర్త్ డే టీజర్ రూపంలో ఇంతకు ముందే అర్థమైపోవడంతో బాహుబలి రేంజ్ లో ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. తీరా చూస్తే విపరీతమైన జాప్యం వల్ల వీరమల్లు కన్నా చాలా ఆలస్యంగా మొదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోలు త్వరగా పూర్తి చేసుకుని రిలీజ్ కూడా అయ్యాయి.

ఇవాళ హఠాత్తుగా హరిహర వీరమల్లు అప్డేట్ ఇచ్చారు. మే 2 అంటే ఎల్లుండి టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. బాగానే ఉంది కానీ ఇంత సడన్ గా ఎందుకని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీని వెనుక బ్యాక్ స్టోరీ లేకపోలేదు. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ ఫ్రీ అవుతాడు. అప్పుడు ముందు పాల్గొనేది ఓజి షూటింగ్ లో. తర్వాతి ప్రాధాన్యం ఉస్తాద్ భగత్ సింగ్ కి ఉంది. వీటికి బిజినెస్ డీల్స్ పరంగా ఎలాంటి సమస్య లేదు. థియేట్రికల్ టెన్షన్ ఎలాగూ ఉండదు కానీ ఓటిటి ఒప్పందాలు కూడా మంచి రేట్ కి జరిగిపోయాయి. సో నిర్మాతలు సేఫ్.

ఎటొచ్చి వీరమల్లు వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలంటే ముందు పవన్ ఈ సినిమాని పూర్తి చేసేలా ప్రణాళికలు వేసుకోవాలి. తగ్గిన బజ్ ని పెంచాలంటే ప్రమోషన్ పరంగా ఏదైనా మేజిక్ జరగాలి. ఎలాగూ జనసేన ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు మంచి మైలేజ్ వస్తుంది. ఈ ఊపుని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతోనే వకీల్ సాబ్ రీ రిలీజ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు గురించి బిజినెస్ వర్గాల్లో చర్చ జరగాలన్నా, ఓటిటిలో డిమాండ్ పెరగాలన్నా కొత్త పబ్లిసిటీ అవసరం. అందుకే టీజర్ తో దానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హైప్ రావడంలో ఈ వీడియోనే కీలక పాత్ర పోషించనుంది.