మళ్లీ రొడ్డకొట్టుడు సినిమాలతో విసుగెత్తిస్తున్నాడు

తెలుగువాడైన విశాల్ తమిళంలో పెద్ద మాస్ హీరోగా ఎదిగాడు. ‘చెల్లమే’ అనే సాఫ్ట్ మూవీతో అతను హీరోగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత ‘సెండై కోళి’ (తెలుగులో పందెం కోడి) అనే మాస్ మూవీ చేసి యాక్షన్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్నుంచి అతడిది మాస్ బాటే.

ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాలే చేసి హీరోగా ఎదిగాడు. ఐతే ఎప్పుడూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తే ఏ హీరో కెరీర్ కూడా నడవదు. అందుకే విశాల్ మధ్యలో రూటు మార్చాడు. ఇరుంబు తిరై (అభిమన్యుడు), తుప్పరివాలన్ (డిటెక్టివ్) లాంటి వైవిధ్యమైన చిత్రాలతో అతను మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వాటిలో కూడా యాక్షన్ ఉంటుంది కానీ.. దానికి తోడు మంచి కథా ఉంటుంది. కొత్తగా అనిపిస్తాయి. ఒక టైంలో ఇలా భిన్నమైన దారిలో ప్రయాణం చేశాడు విశాల్.

కానీ కొన్నేళ్ల నుంచి విశాల్ మళ్లీ రొడ్డకొట్టుడు సినిమాలతో ప్రేక్షకులను విసుగెత్తిస్తున్నాడు. సామాన్యుడు, లాఠీ లాంటి సినిమాలు చూసి ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. ఆ సినిమాలో ఫైట్లు తప్ప ఏమీ ఉండవు. రొటీన్ కథలతో తన కటౌట్‌కు తగ్గ మాస్ ఫైట్లు పెట్టి లాగించేశాడు. కథలో కొంచెమైనా కొత్తదనం లేకుండా.. కేవలం ఫైట్లే చేస్తుంటే చూసేదెవరు? ఇప్పుడు విశాల్ నుంచి వచ్చిన ‘రత్నం’ అయితే మరీ దారుణం.

సినిమా అంతా ఫైట్లు తప్ప ఏమీ లేదు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చుట్టూ తిరిగే చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా సాగదీసిన హరి.. ప్రేక్షకులను విసుగెత్తించేశాడు. సినిమా అంతా హీరోయిన్ మీద రౌడీలు ఎటాక్ చేయడం.. హీరో కాపాడ్డం.. ఇదే కథ. లొకేషన్లు మారుతుంటాయి కానీ.. ఒకటే కాన్సెప్ట్ మీద హీరో ఫైట్లు చేసుకుంటూ గడిపేస్తాడు. విశాల్ అర్జెంటుగా రూటు మార్చి భిన్నమైన కథలు ట్రై చేయకుంటే అతడి కెరీర్ పుంజుకోవడం చాలా కష్టం.