మహేష్-రాజమౌళి.. కథ తెలుసన్న నిర్మాత

ఇప్పటిదాకా ఇండియాలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న రాజమౌళి-మహేష్ బాబు మూవీనే ఇండియన్ ఫిలిం హిస్టరీలో బడ్జెట్ పరంగా బిగ్గెస్ట్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వసూళ్ల పరంగా కూడా అది నంబర్ వన్ సినిమాగా మారడం ఖాయం.

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ లెవెల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన రాజమౌళి.. పక్కా ఇంటర్నేషనల్ మూవీలా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అంటూ ఈ సినిమా గురించి ముందు నుంచి ఊరిస్తున్నాడు జక్కన్న. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్టు లాక్ అయిందని.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో టీం నిమగ్నమై ఉందని తెలుస్తోంది.

ఐతే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణకు గతంలో ఇచ్చిన మాట మేరకు ఆయనకు ఈ సినిమాను రాజమౌళి చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఐతే నారాయణ సంస్థ దుర్గా ఆర్ట్స్ చాలా ఏళ్లుగా ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేయగలరా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ నారాయణ అండ్ టీమే ఈ సినిమాను నిర్మించే విషయంలో ఏ అనుమానాలు అక్కర్లేదని.. ఆయన టీం కథా చర్చల్లో, అలాగే ప్రి ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటోందని వెల్లడైంది.

‘దుర్గా ఆర్ట్స్’లో భాగస్వామి, ఆ సంస్థ సమర్పకుడు అయిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి.. తాజాగా మహేష్-రాజమౌళి సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. తాను ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్నానని.. కథ కూడా తనకు తెలుసని గోపాల్ రెడ్డి వెల్లడించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలు కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని.. మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మొద్దని గోపాల్ రెడ్డి తెలిపారు. అంతే కాక ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.