వ్యవస్థను ప్రశ్నించే నిజమైన ‘ప్రతినిధి’

విలక్షమైన కథలను ఎంచుకునే నారా రోహిత్ వచ్చే వారం ఏప్రిల్ 25న ప్రతినిధి 2గా రాబోతున్నాడు. టీజర్, పోస్టర్ల ద్వారా కంటెంట్ ఏంటో ముందే క్లూ ఇచ్చేశారు కాబట్టి అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. టీవీ 5 మూర్తి మొదటిసారి మెగా ఫోన్ చేపట్టి దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో పెద్ద తారాగణమే ఉంది. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న తరుణంలో ఈ చిత్రం రిలీజుకు సిద్ధపడటం ఆసక్తి రేపుతోంది. అందులోనూ గత రెండు నెలల్లో వచ్చినరాజకీయ ఎజెండా సినిమాలు ఆదరణ దక్కించుకోలేదు. వాటికి భిన్నంగా సీరియస్ కంటెంట్ తో రూపొందింది ప్రతినిధి 2.

ఆవేశం కన్నా ఆలోచన ఎక్కువగా ఉండే ఒక జర్నలిస్టు(నారా రోహిత్) ఎదురుగా ఎవరున్నా తప్పుని సూటిగా ఎత్తి చూపించే టైపు. అధికార పార్టీ నాయకుడిని అప్పులతో పాటు మీ ఆస్తులు ఎలా పెరిగాయని అడిగే ధైర్యం. అంతే కాదు గాంధీ చనిపోయినప్పుడు పోని వందల ప్రాణాలు కేవలం ఒక రాష్ట్ర మంత్రి కన్ను మూస్తే ఎలా కొండెక్కిపోతున్నాయని అడిగే తరహా. ఇతని పనుల వల్ల అలజడి రేగుతుంది. అయితే ఆషామాషీ టీవీ విలేఖరి కాదని గుర్తించిన ఓ అధికారి(జిస్సు సేన్ గుప్తా) క్రమంగా విచారణ చేయడం మొదలుపెడతాడు. ప్రతినిధి లక్ష్యం ఏంటో తెరమీదే చూడాలి.

సన్నివేశాల్లో డెప్త్ కనిపిస్తోంది. లోతయిన అంశాలతో టీవీ5 మూర్తి వర్తమాన సమాజంలోని రాజకీయ కుళ్ళుని గట్టిగానే చూపించే ప్రయత్నం స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా ఫలానా సిఎంనో మినిస్టర్ నో టార్గెట్ చేసినట్టు కాకుండా ఎప్పుడు చూసినా వర్తించేలా కొన్ని పాయింట్స్ చూపించిన తీరు బాగుంది. సచిన్ కెద్కర్, అజయ్ ఘోష్, ఇంద్రజ, జిస్సు సేన్ గుప్తా, రఘుబాబు, ఉదయ భాను ఇలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సిరి లెల్ల హీరోయిన్. మహతి స్వరసాగర్ సంగీతం, నాని ఛాయాగ్రహణం డెప్త్ ని తీసుకొచ్చాయి. మొత్తానికి చూడాలన్న ఆసక్తి రేపడంలో ప్రతినిధి 2 టీమ్ సక్సెస్ అయ్యింది.