రామ్ చరణ్ 17 నేపథ్యం ఏంటంటే

రెండు రోజుల ముందే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూసిన శుభవార్త వచ్చేసింది. రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో ఆర్సి 17ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి మార్చి 27 చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన ఉంటుందని వారం ముందే లీక్ వచ్చేసింది. దీంతో ఎగ్జైట్ మెంట్ కాస్తా బయటికెళ్లిపోవడంతో ఇవాళ మంచి టైం చూసి అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ సృష్టించిన రికార్డులు అంత సులభంగా మర్చిపోలేం. నాన్ బాహుబలి మైలురాళ్ళు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక అసలు పాయింట్ కు వద్దాం.

ఈ గుడ్ న్యూస్ సరే కానీ ఇంతకీ ఎలాంటి కథ చెప్పబోతున్నారనేది అసలు సస్పెన్స్. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సుకుమార్ ఈసారి పల్లెటూరి నేపథ్యం తీసుకోవడం లేదు. ఆల్రెడీ రంగస్థలంలో చూపించారు. శిష్యుడు బుచ్చిబాబు తీస్తున్నది విలేజ్ డ్రామా. అలాంటప్పుడు అదే నేపథ్యంలో మళ్ళీ స్టోరీ రాస్తే రొటీన్ అయిపోతుంది. అందుకే యాక్షన్ జానర్ వైపు మొగ్గు చూపారని తెలిసింది. 1 నేనొక్కడినే చేసినప్పుడు జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని పక్కా కమర్షియల్ మూవీని ప్లాన్ చేశారట. బడ్జెట్ కూడా మైత్రి బ్యానర్ లోనే హయ్యెస్ట్ అవ్వబోతోంది.

సో అంచనాలు ఎంతైనా పెట్టుకోవచ్చన్న మాట. పుష్ప 2 ది రూల్ ముగించే పనిలో ఉన్న సుకుమార్ పుష్ప 3 దాదాపు డ్రాప్ అయినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే బుచ్చిబాబు సినిమాని రామ్ చరణ్ పూర్తి చేసుకుని వచ్చేలోపు ఆర్సి 17 స్క్రిప్ట్ సిద్ధమైపోవాలి. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని కొనసాగిస్తున్నారు. మైత్రితో తన అనుబంధం ఎలాంటిదో మరోసారి చెప్పనక్కర్లేదు. అఫీషియల్ క్లారిటీతో అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. 2026 విడుదల లక్ష్యంగా షూటింగ్ తదతర కార్యక్రమాలు ప్లాన్ చేసుకోబోతున్నారు. క్యాస్టింగ్ కు సంబంధించి ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు.