గేట్లు తెరిచింది.. ఇక దూకుడేనా

అందం, అభినయం రెండూ ఉండి.. కాస్త స్టార్ ఇమేజ్ కూడా ఉన్న హీరోయిన్లకు ఇప్పుడు మామూలు డిమాండ్ లేదు. ఇలాంటి హీరోయిన్ల కొరత అన్ని ఇండస్ట్రీలనూ వేధిస్తోంది. టాలీవుడ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల ముందు వరకు కాజల్, సమంత, తమన్నా, అనుష్క.. ఇలా మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేది. కానీ వాళ్లందరికీ కాస్త వయసు పెరిగి, జోరు తగ్గిపోయి టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఏర్పడింది.

ఇప్పుడు ఈ స్థాయి హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్నా మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు అన్ని రకాల ఆకర్షణలూ ఉండి, ఎక్కువ డిమాండ్ ఉన్నది పూజాకు మాత్రమే అని చెప్పాలి. రష్మికకు కూడా కొన్ని మైనస్‌లున్నాయి. ఈ నేపథ్యంలో సరైన హీరయిన్ టాలీవుడ్లోకి అడుగు పెడితే అవకాశాలకు లోటే ఉండదు. బాలీవుడ్ భామ కియారాకు ఇక్కడ మంచి డిమాండ్ ఉన్నా కూడా.. ఆమె సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటోంది.ఇలాంటి పరిస్థితుల్లోనే శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది.

ఆమెను టాలీవుడ్‌కు రప్పించడానికి చాన్నాళ్ల ముందు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ సరసన పూరి జగన్నాథ్ తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వార్త బయటికి వచ్చింది. నిజంగా ఈ సినిమా ఓకే అయినట్లయితే.. టాలీవుడ్లో అవకాశాల వెల్లువకు జాన్వి గేట్లు తెరిచినట్లే.

అరంగేట్రానికి ముందే ఆమెకు డిమాండ్ ఉండగా.. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆమె కోసం వేరే నిర్మాతలు కూడా టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించబోయే సినిమాకు జాన్విని అడుగుతున్నారట. ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి టైం పడుతుంది కానీ.. ముందే జాన్వి నుంచి కమిట్మెంట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందట. తారక్ సరసన కూడా జాన్వి ఓకే అయిందటే.. మిగతా స్టార్లను కూడా జాన్వి ఒక రౌండ్ వేసేయడం లాంఛనమే అనుకోవచ్చు.