కేసీఆర్‌ ఫాంహౌస్‌కి అంద‌రికీ వెల్‌కం.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్‌రావు‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన ప్రాంతం హైద‌రాబాద్ స‌మీపంలో ఉన్న ఆయ‌న ఫాం‌హౌస్‌. ఈ వ్య‌వ‌సాయ క్షేత్రం విష‌యంలో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు ఎదురైన‌ప్ప‌టికీ కేసీఆర్ వాటిని ఏనాడూ లెక్క‌చేయ‌లేదు. అంతేకాకుండా వాటిని త‌న‌దైన శైలిలో తిప్పికొట్టారు కూడా.

కేసీఆర్‌కు అత్యంత ఆప్తుల‌కు మాత్ర‌మే ఈ ఫాంహౌస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. అయితే, ఈ వ్య‌వ‌సాయ‌క్షేత్రంలోకి అంద‌రికీ ఎంట్రీ ఉండ‌నుంద‌ట‌‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేసీఆరే వెల్ల‌డించారు. ఎందుకంటే, ఆయ‌న‌కు ఇష్ట‌మ‌య్యే వ్య‌వ‌సాయ ప‌నుల విష‌యంలో సంస్క‌ర‌ణల కోసం.

తెలంగాణలోని రైతుల త‌మ‌కు న‌చ్చిన పంట‌లు వేయ‌కుండా ప్ర‌భుత్వం చెప్పిన పంట‌లే పండించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్డ‌ర్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో త‌గు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసేందుకు మంత్రులు, సీనియర్‌ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ వర్సిటీ అధికారులు, సైంటిస్టులతో స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసి, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని ప్రకటించారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగిన, నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని వెల్లడించారు. ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగుచేస్తే రైతుకు ఏ ఇబ్బందీ ఉండదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వంలాంటి అనుకూలతలను సద్వినియోగంచేసుకుని ప్రపంచంతో పోటీపడే గొప్ప రైతాంగంలా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విత్తనాల కల్తీలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విత్తన కల్తీదారులు హంతకులతో సమానమని హెచ్చరించారు. కల్తీ విత్తనాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రజాప్రతినిధులు కల్తీవిత్తన విక్రేతలను కాపాడే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర జీవికలో వ్యవసాయం ప్రధాన భాగమని, వ్యవసాయం భవిత ఉజ్వలంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులు నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచానికి అందించడం ద్వారా లాభాలు గడించాలని ఆకాంక్షించారు. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగుచేయాలి? ఏ రకం సాగుచేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉన్నదో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తోంది అని తెలంగాణ‌ సీఎం తెలిపారు. రైతుల‌కు స‌మ‌గ్ర స‌మాచారం అందించేందుకు రైతు వేదిక‌లు నిర్మించాల‌ని కోరారు.

తన వ్యవసాయ క్షేత్రమున్న ఎర్రవల్లిలో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశంలోనే ప్రకటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర మంత్రులంతా తలా ఒక రైతువేదికను సొంత ఖర్చులతో నిర్మించడానికి ముందుకొచ్చారు. కాగా, త‌న ఫార్మ్ హౌస్‌లోకి తెలంగాణ సీఎం రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం, ఆయ‌న స్ఫూర్తితో మంత్రులు ముందుకు రావ‌డం విశేష‌మ‌ని అంటున్నారు.