మనమడికి ఇన్ఫో నారాయణమూర్తి ఖరీదైన గిఫ్టు

తండ్రి దగ్గర కొడుక్కి లేని చనువు మనమడికి ఉంటుందని చెబుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా తన మనమడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతి అందజేశారు. తన సంస్థలోని 15 లక్షల షేర్లను మనవడి పేరు మీద రిజిస్టర్ చేశారు.

ఈ భారీ షేర్ల విలువ ఏకంగా రూ.240 కోట్లు ఉంటుందని అంచనా. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనమడికి బహుమతిగా ఇచ్చినట్లుగా బీఎస్ఈ ఫైలింగ్ లో నారాయణమూర్తి తెలిపారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్ లో 0.40 వాతం వాటా ఉంది. ఇందులో భాగంగా ఆయన వద్ద రూ.1.51 కోట్ల షేర్లు ఉండగా.. వాటిల్లో దగ్గర దగ్గర ఒక శాతం షేర్లను మనమడికి కట్టబెట్టారు. గత ఏడాది నవంబరులో ఆయన కొడుకు రోహాన్ మూర్తి.. కోడలు అపర్ణ క్రిష్ణన్ లకు ఏకాగ్రహ్ పుట్టారు.

తాత ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఏకాగ్రహ్ భారత్ లోని అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్ గా అవతరించారు. నారాయణమూర్తి.. సుధామూర్తికి ఇద్దరు సంతానమన్న విషయం తెలిసిందే.వారిలో కుమార్తె అక్షతా మూర్తి పెద్దవారైతే.. కొడుకు రోహన్ మూర్తి రెండోవారు. అక్షతామూర్తి 2009లో రిషి సునాక్ (ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి)ని పెళ్లాడగా.. రోహన్ విషయానికి వస్తే.. 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీతో పెళ్లైంది. వారిద్దరు 2015లో విడిపోయారు. అనంతరం 2019లో అపర్ణ క్రిష్ణన్ తో పెళ్లి జరిగింది. వీరికి కలిగిన సంతానమే ఏకాగ్రహ్. మనమడికి తాత ఇచ్చిన ఖరీదైన బహుమతి ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.