ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైద‌రాబాదీ మృతి

రెండేళ్లుగా సాగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా ఘోరం చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తి ఒక‌రు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహ్మద్ అఫ్సాన్ (30) అనే యువ‌కుడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అఫ్సాన్ మృతి విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అఫ్సన్ ను హెల్పర్ ఉద్యోగం కోసం ఏజెంట్లు హైదరాబాద్ నుంచి రష్యా తీసుకెళ్లారు.

అక్కడ ఉద్యోగం విషయంలో మోసపోవడంతో అఫ్సన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, రష్యా సైన్యానికి సహాయ సిబ్బందిగా పని చేస్తున్న‌ దాదాపు 20 మంది భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు, అఫ్సాన్ ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అతని కుటుంబం ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది.

దీంతో ఆయన చొరవతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అఫ్సాన్ చనిపోయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఫ్సాన్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు రావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు నాయ‌కులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా బాధాకరం. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అఫ్సాన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మోసపోయిన, విషాద పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ యువకులను తిరిగి స్వస్థలాలకు చేరేలా సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా“ అని ట్వీట్ చేశారు.