సురేష్ రైనా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు

టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్‌మన్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సురేష్ రైనా వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ కోసం దుబాయ్‌కి వెళ్లిన అతను.. కొన్ని రోజుల్లోనే వ్యక్తిగత కారణాలతో ఇంటిముఖం పట్టడం, ఈసారి ఐపీఎల్ సీజన్ మొత్తానికి అతను దూరమవుతున్నట్లు ప్రకటన రావడం సంచలనం రేపింది.

అతనిలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. ఈ విషయంలో రోజుకో వార్త పుట్టుకొచ్చింది. దీంతో జనాలు బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఐతే తాను స్వదేశానికి వచ్చేయడానికి ప్రధాన కారణం.. తన మేనత్త ఇంట్లో నెలకొన్న విషాదమే అని రైనా స్పష్టత ఇచ్చాడు ఇప్పటికే. రైనా మేనత్త భర్తతో పాటు, అతడి కజిన్ కూడా దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. రైనా మేనత్త సైతం మృత్యువుతో పోరాడుతోంది.

ఇదిలా ఉండగా తాను తప్పుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో గొడవ ఎంతమాత్రం కారణం కాదని రైనా స్పష్టం చేశాడు. సీఎస్కేతో తనకు చక్కటి అనుబంధం ఉందని, అది కొనసాగుతుందని అతనన్నాడు. తనకు విజయ గర్వం తలకెక్కిందన్నట్లుగా సీఎస్కే యజమాని శ్రీనివాసన్ వ్యాఖ్యానించడం, మరికొన్ని విమర్శలు చేయడం గురించి రైనా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

శ్రీనివాసన్ తన తండ్రి లాంటివాడని.. తనను తన చిన్న కొడుకులాగే చూసుకున్నాడని.. తాను ఎందుకు తప్పుకున్నాడో పూర్తిగా తెలియని సమయంలో శ్రీనివాసన్ అలా మాట్లాడి ఉండొచ్చని.. ఒకవేళ ఆయన విమర్శించినా ఒక తండ్రి కొడుకును మందలించాడనే అనుకుంటానని రైనా చెప్పాడు. సీఎస్కేతో భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందని అడిగితే.. ఇంకో నాలుగైదేళ్లు ఐపీఎల్‌లో అదే జట్టుతో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పాడు.

అంతే కాక.. తాను స్వదేశానికి వచ్చాక క్వారంటైన్లో ఉంటూనే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నానని.. ఈ ఏడాదే మళ్లీ చెన్నై జట్టు శిబిరంలో తాను కనిపిస్తే ఆశ్చర్యపోవద్దని రైనా పేర్కొనడం గమనార్హం. ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడనుకున్న రైనా.. మళ్లీ ఐపీఎల్‌లో కనిపిస్తే అదో పెద్ద ట్విస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు.