ప్ర‌పంచ వేగ‌వంత‌మైన మ‌నిషికి క‌రోనా?

ఏ స్థాయి వ్య‌క్తి అయినా.. ఎంత ఫిట్‌గా ఉన్నా.. క‌రోనా ఏమీ క‌నిక‌రించ‌ద‌ని.. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌రోనా బారిన ప‌డ‌క త‌ప్ప‌ద‌ని మ‌రోసారి రుజువైంది. కేవ‌లం 9.58 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే 100 మీట‌ర్ల ప‌రుగును పూర్తి చేసి ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పి.. ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన మ‌నిషిగా గుర్తింపు పొందిన జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు కానీ.. బోల్ట్ కరోనా పరీక్షకు వెళ్లడం, ఆ తర్వాత హోమ్ క్వారంటైన్ కావడం మాత్రం నిజం.

అంతర్జాతీయ మీడియా మాత్రం బోల్ట్‌కు కరోనా ఉన్నట్లు ధ్రువీకరిస్తూ వార్తలు ఇచ్చేసింది. కానీ బోల్ట్ దీనిపై ఓ సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను కరోనా పరీక్షకు హాజరైన మాట వాస్తవమే అని.. కానీ ఇంకా పాజిటివ్‌గా ఖరారు కాలేదని.. ఈ లోపు సామాజిక బాధ్యతతో హోం క్వారంటైన్ అయ్యానని అతను వెల్లడించాడు.

ఐతే బోల్ట్ కరోనా లక్షణాలతోనే బాధ పడుతున్న నేపథ్యంలో అతను వైరస్ బారిన పడ్డట్లే అని అంటున్నారు. ఫలితం కూడా పాజిటివ్‌గా వచ్చిందని.. కానీ బోల్ట్ ఆ విషయాన్ని దాస్తున్నాడని అంటున్నారు. బోల్ట్ ఈ విషయంలో సంకోచిస్తుండటానికి కారణాలు లేకపోలేదు. ఈ నెల 21న ఉసేన్ 34వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. దానికి పెద్ద ఎత్తున అతిథులు హాజరయ్యారు. వాళ్లంతా కలిసి ఓ పెద్ద మీటింగ్ హాల్లో విందులు, వినోదాల్లో మునిగి తేలారు. డీజే పెట్టి డ్యాన్సులు వేశారు.

అందులో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు. బోల్ట్ వాళ్లందరితో కలిసి డ్యాన్సులేస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న ఈ సమయంలో బోల్ట్ అండ్ కో కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలా పార్టీ చేసుకోవడమేంటి.. అందులోనూ మాస్కులు కూడా ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం ఏంటి అని అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా బోల్టే కరోనా బారిన పడ్డాడంటే తీవ్ర విమర్శలు తప్పవు. ఈ నేపథ్యంలోనే అతను ఈ విషయాన్ని దాచాలని చూస్తున్నాడని భావిస్తున్నారు.