కోహ్లి ఇన్‌స్టాలో ఒక్క పోస్టు పెడితే..


విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కాదు. మూడు ఫార్మాట్లలోనూ అతను కెప్టెన్సీకి దూరం అయ్యాడు. అతడి ఫామ్ కూడా మునుపటి స్థాయిలో లేదు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయక చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో సెంచరీ సంగతి పక్కన పెట్టి అర్ధశతకాలు సాధించడం కూడా కష్టమైపోయింది. ఐతే ఇటీవల ఆసియా కప్ నుంచి అతను పర్వాలేదనిపిస్తున్నాడు.

ఐతే ఆట తగ్గినా, కెప్టెన్సీకి దూరం అయినా అతడి ఆకర్షణ ఏమీ తగ్గిపోలేదు. తన బ్రాండ్ వాల్యూ ఏమీ పడిపోలేదు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న స్పోర్ట్స్ పర్సన్ అతనే కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లి ఒక్క ప్రమోషనల్ పోస్టు పెడితే ఏకంగా రూ.8.9 కోట్లు ఇస్తారట. ఒక బిజినెస్ పోర్టల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సంస్థ ఫిలిం, స్పోర్ట్స్ పర్సన్స్ బ్రాండ్ వాల్యూను అంచనా వేస్తుంటుంది.

ఇన్‌స్టా‌గ్రామ్‌లో కోహ్లికి ఏకంగా 21.5 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండియాలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లున్న క్రికెటర్ అతనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క పోస్టు పెడితే 21.5 కోట్ల మందికి రీచ్ అవుతుంటే అంతకంటే ప్రచారం ఇంకేం కావాలి. అందుకే పెయిడ్ పోస్టులకు ప్రకటనల సంస్థలు ఆ స్థాయిలో డబ్బులిస్తాయన్నమాట. కోహ్లి అప్పుడప్పుడూ ఇన్‌స్టాలో కొన్ని బ్రాండ్లను ప్రచారం చేస్తుంటాడు.

ఇక ప్రపంచ స్థాయిలో ఒక ఇన్‌స్టా పోస్టు ద్వారా అత్యధిక మొత్తంలో ఆర్జించే స్పోర్ట్స్ పర్సన్ పోర్చుగల్ ఫుట్ బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అట. అతడికి ఇన్‌స్టాలో 40 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అతను ఒక పోస్టు పెడితే రూ.18 కోట్లు చెల్లిస్తారట. మరో ఫుట్ బాల్ స్టార్ లయొనెల్ మెస్సికి ఇన్‌స్టాలో 36 కోట్ల దాకా ఫాలోవర్లు ఉండగా.. అతడికి ఒక్కో పోస్టుకు రూ.14 కోట్ల దాకా చెల్లిస్తారట. ఇండియాలో కోహ్లి తర్వాత ప్రస్తుతం అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న స్పోర్ట్స్ పర్సన్ ధోనీనే.