కరోనాను లైట్ తీసుకున్నారా.. ఐతే ఈ స్టోరీ చదవాల్సిందే

ఈ మధ్య దర్శకుడు తేజ.. కరోనా ఉద్ధృతి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మన భారతీయుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చాలా చక్కగా చెప్పారు. ‘‘కరోనా నాకు రాదు.. నేను కలిసే వాళ్లకు కూడా కరోనా ఉండదు’’ అనేది మనోళ్ల ఆలోచన అని.. ఆ ధైర్యంతోనే ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా తిరిగేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది నూటికి నూరు శాతం నిజం అని వివిధ కరోనా కేసుల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ జ్యువెలరీ వ్యాపారి కరోనా భయం ఏమాత్రం లేకుండా పుట్టిన రోజు వేడుక నిర్వహించి.. కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ వేడుకలో పాల్గొన్న ఆయన స్నేహితుడైన మరో వ్యాపారి కూడా కరోనాతో మృత్యువాత పడ్డాడు. ఈ రెండు కుటుంబాల్లో ఇప్పుడు విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే..

హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న ఓ జ్యువెలరీ షాపు వ్యాపారి జూన్ మూడో మూడో వారంలో తన ఇంట్లో పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలేమీ పాటించకుండా ఏకంగా ఈ వేడుకకు 150 మంది పాల్గొన్నారు. అందులో ఓ ప్రజాప్రతినిధితో పాటు జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి ఘనంగా విందు భోజనం కూడా చేశారు. మనం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం… విందుకు వినియోగించిన పాత్రలు, ఆహార పదార్థాలతో సహా అన్నీ శుభ్రం చేశాం. మీటింగ్ హాల్‌ను కూడా ముందే శానిటైజ్‌ చేశాం.. కాబట్టి మనకు కరోనా భయం లేదు అని సదరు వ్యాపారి అతిథులతో అన్నాడట. ఈ వేడుకకు వచ్చిన వాళ్లందరికీ మంచి బహుమతులు కూడా ఇచ్చి పంపించారాయన.

ఐతే వేడుక అయ్యాక ఆ వ్యాపారికి దగ్గు, ఆయాసం వచ్చాయి. తర్వాతి రోజు ఆసుపత్రికి వెళ్తే, మందులు ఇచ్చాక ఎందుకైనా మంచిది కరోనా పరీక్ష చేయించుకోమని చెప్పారట. కానీ ఆయన వినిపించుకోలేదు. ఐతే ఈ విందుకు హాజరైన ఓ వ్యాపారికి నాలుగు రోజుల తర్వాత తీవ్ర జ్వరం వచ్చింది. ఆయన కూడా వెంటనే అప్రమత్తం కాలేదు. తర్వాత పరిస్థితి విషయమించింది. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు తేలింది. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఆపై పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వ్యాపారికి దగ్గు, ఆయాసంతో పాటు జ్వరం కూడా రావడంతో ఐదు రోజుల కిందట సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కూడా పరిస్థితి విషమించి మూడు రోజుల క్రితం ప్రాణాలు వదిలాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు, పోలీసులు.. ఇప్పుడా వేడుకలో పాల్గొన్న అందరి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.