650 రైళ్ళ సర్వీసుల రద్దు

చాలామందికి ఉండే అనుమానం ఏంటంటే… రైళ్లకు డిమాండ్ ఉన్నా ఎందుకు పెంచరు అని. ఎపుడు చూసినా వెయిటింగ్ లిస్ట్ వస్తుంది… ఇంకో రైలు వేస్తే వీళ్లకే లాభం కదా అనుకునే సామాన్యులు చాలా మంది ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే… ప్రస్తుతం ఉన్న రైల్ రోడ్ నెట్ వర్క్, సిగ్నలింగ్ నెట్ వర్క్ కెపాసిటీకి అనుగుణంగా రైళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఒక కొత్త రైలు నడపాలన్నా… ఏదో ఒక రైలునో గూడ్స్ రైలునో ఆపాలి. చరిత్రలో ఇంతవరకు ప్యాసింజర్ రైలుకోసం గూడ్స్ రైలును ఆపడం చూశాం. కానీ మొదటి సారి గూడ్స్ రైలు కోసం ప్యాసింజర్ల రైలు ఆపడం కాదు, మొత్తం రద్దు చేయడం మొదటి సారి ఇది.

ముందుగా చెప్పినట్లే కేంద్ర రైల్వేశాఖ 650 రైళ్ళ సర్వీసులను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయటానికి వీలుగా ఫాస్ట్ ట్రాన్స్ పోర్టేషన్ కోసమనే వందలాది రైళ్ళను కేంద్రం రద్దు చేసింది. ఇదే విషయమై గతంలోనే 42 రైళ్ళను రద్దుచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు రద్దు చేసిన 650 రైళ్ళకు 1100 ప్రయాణీకుల రైళ్ళ ట్రిప్పులను రద్దుచేసినట్లయ్యింది. విద్యుత్ సంక్షోభం బాగా పెరిగిపోవటంతో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం కేంద్రం మీద పడింది.

దేశవ్యాప్తంగా 173 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుంటే అందులో 108 కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. మామూలుగా అయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కావాలంటే 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలి. కానీ ప్రస్తుతం 1, 2 రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. దీంతోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో అర్ధమైపోతోంది.

ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పై రాష్ట్రాలపైన ఎక్కువ ప్రభావం పడింది. దానికితోడు మనకు రెగ్యులర్ గా బొగ్గు రష్యా, ఉక్రెయిన్ నుండి వస్తుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా బొగ్గు దిగుమతులు ఆగిపోయాయి. అలాగే మనకు బొగ్గును సరఫరా చేసే ఆస్ట్రేలియా, ఇండోనేషియా కూడా బొగ్గు సరఫరాను తగ్గించేశాయి.

యుద్ధం కారణంగా నాటో దేశాలతో పాటు యురోపుదేశాలకు రష్యా సహజ వాయువును సరఫరా ఆపేసింది. దాంతో సుమారు 30 దేశాలు బొగ్గుపైనే ఆధారపడ్డాయి. అందుకనే అవన్నీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుండి బొగ్గును కొనేస్తున్నాయి. అందుకనే ఈ దేశాలు మనకు బొగ్గు సరఫరాను తగ్గించేశాయి. దేశంలో ఉత్పత్తవుతున్న విద్యుత్ లో 70 శాతం బొగ్గు ఆధారంగానే ఉత్పత్తవుతోంది. ఈ సమస్యల నేపధ్యంలోనే కేంద్రం విదేశాలనుండి బొగ్గును దిగుమతి చేసుకోవటం, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచటం లాంటి చర్యలు మొదలుపెట్టింది. అందుకనే వీటి సరఫరాకు రైళ్ళను కూడా రద్దుచేసింది.