వైన్ షాపుల ముందు మాస్కుల్లేవ్.. పోలీసులు ఏం చేశారంటే?

మాస్కుల్లేకుండా బయట తిరగడం చట్ట విరుద్ధం ఇప్పుడు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటోంది. అక్కడ మాస్కు లేకుండా బయట తిరిగిన వాళ్లకు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా వచ్చాయి.

మాస్క్ లేకుండా బయట తిరిగి వెయ్యి ఫైన్ వేయించుకున్న వాళ్లు బిల్లులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐతే మాస్క్‌ను లైట్ తీసుకుంటే కేవలం ఫైన్ వేసి వదిలేయడమే కాకుండా ఇంకా తీవ్రమైన చర్యలకు కూడా దిగుతున్నారు అక్కడి పోలీసులు.

అనంతపురంలో ఓ వైన్ షాపు ముందు కొందరు మందు బాబులు మాస్కుల్లేకుండా కనిపించగా.. వాళ్లందరినీ పోలీసులు వల వేసి పట్టుకున్నారు. అంబులెన్స్ తీసుకొచ్చి అందులోకి ఆరుగురిని ఎక్కించి నేరుగా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌కు తరలించేశారు. అక్కడే రెండు వారాలు పెట్టి తర్వాతే వారిని ఇంటికి పంపించనున్నారట. మాస్కుల్లేని వ్యక్తులు ఎంతగా బతిమాలుతున్నా వినకుండా వాళ్లందరినీ పోలీసులు, వైద్య సిబ్బంది అంబులెన్స్ ఎక్కిస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఐతే పోలీసులు ఇంత కఠినంగా ఉండటం మంచిదే కావచ్చు కానీ.. రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకులు మాత్రం మాస్కులను లైట్ తీసుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా ప్రభావం మొదలయ్యాక, గత మూడు నెలల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా మాస్కతో కనిపించలేదు.

ప్రెస్ మీట్ల సమయంలో, కేబినెట్ సమావేశాల్లో, అసెంబ్లీలో.. ఇలా ఎప్పుడైనా ఆయన మాస్కు లేకుండానే దర్శనమిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో చాలామంది మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాస్కులు ధరించలేదు. ప్రభుత్వాన్ని నడిపేవారు ఇలా మాస్కుల్లేకుండా ఉంటూ.. తమకు మాత్రం మాస్కులు తప్పనిసరి అని ఎలా చెబుతారన్నది జనాల ప్రశ్న.