రోజులో అన్ని కేసులా?

మూడు.. నాలుగు రోజులు క్రితం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టక్ గా వ్యవహరిస్తున్న గడల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో మూడో వేవ్ మొదలైందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయినప్పటికీ.. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న వైఖరి.. ఇప్పుడు షాకిచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. గడిచిన కొంతకాలంగా హైదరాబాద్ లో నమోదవుతున్న కరోనా కేసులు అంతకంతకూ తగ్గిపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా కొత్త సంవత్సరంలో కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంది.

తాజాగా రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరిగాయి. గత ఏడాది జూన్ తర్వాత తెలంగాణలో మొదటిసారి కొవిడ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. కేవలం రోజు వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా 42,991 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిచంగా.. 1052 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దగ్గర దగ్గర 600 ప్లస్ కేసుల వరకు నమోదైనట్లు పేర్కొన్నారు. సోమవారం నమోదైన కేసులు 294గా ఉంటే.. రోజు గడిచిన తర్వాత దగ్గర దగ్గర 250శాతం పెరుగుదలతో కేసులు నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇదే రీతిలో కేసుల పెరుగుదల ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది. డిచిన 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా తెలంగాణలో పెరుగుతోంది.

గత 24 గంటలవ్యవధిలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కు చేరుకున్నాయి. అంతేకాదు ఎట్ రిస్క్.. నాన్ రిస్క్ దేశాల నుంచి 127 మంది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారని. వారందరికి కొవిడ్ టెస్టులు చేస్తే 8 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. కొవిడ్ పెరుగుదల రేటు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.