భారత సంతతికి చెందిన పరాగ్ కు ట్విటర్ పగ్గాలు ఎందుకిచ్చారు?

పరాగ్ అగర్వాల్.. ఏ మాత్రం పరిచయం లేని పేరు. కానీ.. సోమవారం రాత్రి కాస్తంత పొద్దుపోయిన తర్వాత నుంచి ఈ పేరు పెద్ద ఎత్తున ప్రచారం కావటమే కాదు.. ఇంటర్నెట్ లో ఇతని గురించి తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత కీలక సంస్థల పగ్గాల్ని నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన ప్రముఖుల సరసన పరాగ్ నిలిచారు. ప్రముఖ సోషల్ మీడియా సంస్థల్లో ఒకటైన ట్విటర్ కు కొత్త సీఈవోగా ఎంపికయ్యారు. 45 ఏళ్ల పరాగ్ అగర్వాల్ ఇప్పటివరకు ట్విటర్ సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)గా వ్యవహరిస్తున్నారు.

ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాకో డోర్సే సోమవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అందులో తాను ట్విటర్ ను వీడుతున్నట్లుగా వెల్లడించారు. ‘‘పదహారేళ్ల  పాటు కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుంచి సీఈవోగా.. అక్కడ నుంచి ఛైర్మన్.. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా.. ఆ తర్వాత తాత్కాలిక సీఈవోగా.. సీఈవోగా యాత్ర సాగింది. ఇప్పుడు బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నా’’ అని ప్రకటించారు.

తాజాగా ట్విటర్ సీఈవోగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ విషయానికి వస్తే.. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్..స్టాన్ ఫోర్డ్ లో పీహెచ్ డీ చేసిన ఆయన.. పదేళ్ల క్రితం అంటే 2011లో ట్విటర్ లో చేశారు. ఆయన కంపెనీలో చేరే నాటికి ట్విటర్ లో వెయ్యి కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉండేవారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా తనకు లభించిన  గుర్తింపుపై ఆయన స్పందించారు.

‘ఈ పదవిని చేపట్టటం గౌరవంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. అదే సమయంలో డోర్సేకు థ్యాంక్స్ చెప్పిన పరాగ్.. అతడి మార్గదర్శనం.. ఫ్రెండ్ షిప్ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ పరాగ్ ను ట్విటర్ సీఈవోగా ఎందుకు ఎంపిక చేసినట్లు? అన్న ప్రశ్నకు మూడు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఈవోగా బాధ్యతల నుంచి తప్పుకున్న డోర్సేనే వెల్లడించారు. తన స్థానంలో కూర్చోబెట్టే వ్యక్తికోసం సంస్థ చాలా తీవ్రంగా వెతికిందని.. పరాగ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారన్నారు. పరాగ్ ను ఎంపిక చేయటానికి కారణాలు చెబుతూ..

1. కంపెనీ అవసరాల్ని అతను లోతుగా అర్థం చేసుకున్నాడు
2. ప్రతి కీలక నిర్ణయం వెనుక పరాగ్ ఉండటం.. కంపెనీ ఈ స్థాయికి చేరటం వెనుక అతడే కారణం
3. ఆసక్తి.. హేతుబద్ధత.. క్రియేటివిటీ.. వినయం అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి పని చేస్తాడు

ఇంతకీ పరాగ్ ను ఎంపిక చేసిన డోర్సే కంపెనీని ఎందుకు వీడాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే.. ఆయన స్థాపించిన ఆర్థిక చెల్లింపుల కంపెనీ స్క్క్ ర్ కు సైతం సీఈవోగా ఉన్నారు. రెండు కంపెనీల్్ని సమర్థంగా ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నను కంపెనీలోని పెద్ద పెద్ద పెట్టుబడిదార్లు అతన్ని బహిరంగంగానే ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను ట్విటర్ నిషేధించిన సమయంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి.

వాస్తవానికి 2022లో అతడి పదవీ కాలం ముగిసే వరకు డోర్సే ట్విటర్ బోర్డులో కొనసాగనున్నారు. కాకుంటే సీఈవో బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. ఇక.. తనను సీఈవోగా ఎంపిక చేసిన వేళ స్పందించిన పరాగ్.. కంపెనీలో చేరి పదేళ్లు గడిచిపోయినా.. తనకు నిన్నటిలానే ఉందన్నారు. ఎత్తుపల్లాలు.. గెలుపులు.. ఓటములు.. అన్నీ చూసినట్లు చెప్పారు. అప్పటికి.. ఇప్పటికి ట్విటర్ ప్రభావం అద్భుతంగా మారిందన్నారు.

తమ ముందు గొప్ప అవకాశాలెన్నో ఉన్నాయని.. తమ లక్ష్యాల్ని చేరుకోవటానికి ఇటీవలే వ్యూహాల్ని మెరుగుపరచుకున్నామన్నారు. తమ వినియోగదారులకు.. వాటాదార్లకు.. అందరికీ అత్యుత్తమ ఫలితాల్ని అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. డోర్సే తన సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొని.. పరాగ్ కు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ట్విటర్ షేర్లు 10 శాతానికి పైగా లాభాలు స్వీకరించటం విశేషం.