హైకోర్టు జడ్జికే కండోమ్ లు పంపింది.. ఎందుకంటే?

ఇటీవల కాలంలో మరే న్యాయమూర్తి ఆదేశాలు చర్చకు రానంత ఎక్కువగా ఒక కేసు విషయంలో మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటమేకాదు.. కొత్త చర్చకు తెర తీసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించే క్రమంలో జడ్జి పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలపై పెద్ద రగడే చోటుచేసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్ పై ఆమె చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే.

శరీరాన్ని శరీరం తాకలేదు కాబట్టి.. నేరంగా పరిగణించలేమని.. లైంగిక వేధింపులకు గురైనట్లు కాదని ఆమె వ్యాఖ్యానించటం సంచలనంగా మారటం తెలిసిందే. .ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి ప్యాంట్ జిప్పు తెరిచినా అదేమీ నేరం కాదంటూ ఆమె ఇచ్చిన తీర్పు.. ఆమె ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. ఈ వివాదాస్పద తీర్పును వెల్లడించిన దానికి తగ్గట్లే ఆమె తగ్గ మూల్యం చెల్లించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టింది. ఇదిలా ఉండగా.. జడ్జి పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అహ్మదాబాద్ కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్ శ్రీ త్రివేది తాజాగా కొన్ని కండోమ్ ప్యాకెట్లను పంపారు. అంతేకాదు.. ముంబయిలోని మరో 12 ప్రాంతాలకు ఆమె కండోమ్ ప్యాక్ లు పంపటం సంచలనంగా మారింది. పుష్ప గనేడివాలా తీర్పుతో ఒక మైనర్ బాలికకు న్యాయం జరగలేదని వాపోయారు.

ఆమె తీర్పుపై తన నిరసన వ్యక్తం చేసేందుకు తాను కండోమ్ పాకెట్లు పంపినట్లుగా ఆమె చెప్పారు. ఒక మహిళగా తానుచేసిన పనికి చింతించటం లేదన్నారు. జస్టిస్ గనేడివాలా లాంటి వారి కారణంగా మగాళ్లు మరింత రెచ్చిపోతారని.. ఇకపై అత్యాచారాలు స్త్రీల దుస్తులపైనే జరుగుతాయన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. న్యాయమూర్తికి కండోమ్ పాకెట్లు పంపిన ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.