ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ జీవితంలో AI పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారొచ్చన్న హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది.
చాట్ జీపీటీ, యంత్రోపిక్ వంటి ప్రముఖ ఏఐ సంస్థల్లో పనిచేసినట్లు చెప్పుకుంటున్న జాకబ్ అనే వ్యక్తి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా ఈ రెండు సంస్థల్లో ప్రీ ట్రైనింగ్ రీసెర్చ్పై పనిచేసినట్లు ఆయన వెల్లడించారు.
AI సంస్థలు ప్రస్తుతం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని జాకబ్ ఆరోపించారు. స్వయంగా తమను తాము మెరుగుపరుచుకునే సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల దిశగా కంపెనీలు వేగంగా పరుగులు తీస్తున్నాయని, ఇది మానవాళి భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటగా మారుతోందని అన్నారు.
భవిష్యత్తులో AI వ్యవస్థలు మనుషుల కంటే అనేక రంగాల్లో అత్యంత శక్తివంతంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అవి సైబర్ సిస్టమ్స్ను హ్యాక్ చేయడం నుంచి కొత్త రంగాలను వేగంగా మార్చడం వరకు ఎన్నో పనులు చేయగల స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.
ఇక్కడే ఆయన చేసిన మరో వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దశాబ్దం ముగిసేలోపే AI కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉందని జాకబ్ హెచ్చరించారు. AIని అభివృద్ధి చేస్తున్న పలువురు వ్యక్తులు కూడా ఇలాంటి ప్రమాదం గురించి తీవ్రంగా భయపడుతున్నారని ఆయన అన్నారు.
అయితే ఇవి ప్రస్తుతం ఒక వ్యక్తి చేసిన హెచ్చరికలు మాత్రమే. AI మానవాళిని ఈ దశాబ్దంలోనే అంతం చేస్తుందనే విషయంలో ఎలాంటి నిర్ధారణ లేదు. అయినప్పటికీ AI అభివృద్ధి వేగం, దాని భద్రత, నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates