భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కలిపి ఎక్కువగా అమ్ముడయ్యాయి. FADA డేటా ప్రకారం దేశంలో ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్లు పెట్రోల్ కార్లను దాటడం ఇదే తొలిసారి.
ఆగస్టు అమ్మకాలలో CNG/LPG కార్ల వాటా 25.28 శాతం ఉండగా, హైబ్రిడ్స్ 9.04 శాతం, EVలు 7.63 శాతం వాటా సాధించాయి. ఈ మూడు కేటగిరీలను కలిపితే మొత్తం వాటా 41.95 శాతానికి చేరింది. పెట్రోల్ కార్ల వాటా 40.85 శాతంగా నమోదైంది. అయితే ఒక్క కేటగిరీగా చూస్తే ఇప్పటికీ పెట్రోల్ కార్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
ఈ మార్పు ఒక్క నెలలో వచ్చినది కాదు. గత ఏడాది ఆగస్టులో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్ల కంటే పెట్రోల్ కార్లకు దాదాపు 12 శాతం పాయింట్ల ఆధిక్యం ఉండేది. జూలై 2026లో CNG, హైబ్రిడ్, EVలు కలిపి 40.59 శాతానికి చేరగా, పెట్రోల్ కార్లు 41.68 శాతంతో స్వల్పంగా ముందున్నాయి. ఆగస్టులో మాత్రం CNG, హైబ్రిడ్, EVలు కలిపి మొదటిసారి పెట్రోల్ను దాటేశాయి.
CNG కార్ల రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉండటం, EVల్లో రేంజ్ పెరగడం, ఛార్జింగ్ సదుపాయాలు మెరుగవడం, హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువ కావడం ఈ మార్పుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. E20 పెట్రోల్పై కొంతమంది వినియోగదారుల్లో ఉన్న సందేహాలు కూడా ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్ల వైపు వెళ్లేందుకు కారణమవుతున్నాయని FADA చెబుతోంది. ఆగస్టులో మొత్తం 4.02 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ రిటైల్ కాగా, గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 16 శాతానికి పైగా పెరిగాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates