డిల్లీ ఘటన.. హైదరాబాద్ లో కూడా ఓ లుక్కెయ్యాలి

ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 30 లక్షల ప్రాపర్టీలను తనిఖీ చేసి 27 భవనాలను ప్రమాదకరంగా గుర్తించింది. కానీ చివరకు కూలిపోయిన భవనం మాత్రం ఆ లిస్ట్‌లోనే లేదు. ప్రమాదం జరిగిన తర్వాత చూస్తే సాంక్షన్డ్ ప్లాన్ లేదు, అనధికార బేస్‌మెంట్ ఉంది, ఫైర్ ఎన్ఓసీ కూడా లేదని బయటపడింది. అంటే గుర్తించిన భవనాల కంటే.. గుర్తించకుండా మిగిలిపోయినవే అసలు ప్రమాదమా అనే ప్రశ్న వస్తోంది.

ఇదే కోణంలో హైదరాబాద్‌ను కూడా ఒకసారి అధికారులు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. జీహెచ్‌ఎంసీ గతంలోనే  నగరంలో 350 కి పైగా ప్రమాదకర భవనాలను గుర్తించింది. రాజేంద్రనగర్ జోన్‌లో వందకు పైగా ఉంటే, సికింద్రాబాద్‌లో 70, చార్మినార్‌లో 56, గోల్కొండలో 47 వరకు ఉన్నట్లు గతంలో రిపోర్ట్స్ వచ్చాయి. పాతబస్తీ, సికింద్రాబాద్, ఖైరతాబాద్ వైపు దశాబ్దాల నాటి నిర్మాణాలు ఇంకా చాలా ఉన్నాయి.

అయితే ఇక్కడ ప్రశ్న ఆ 350 లెక్క గురించే కాదు. వాటిని అధికారులు గుర్తించారు కాబట్టి కనీసం రికార్డులో ఉన్నాయి. కానీ పాత భవనంపై అదనపు అంతస్తులు వేసినవి, సెల్లార్‌లో మార్పులు చేసినవి, బయటకు బాగానే కనిపించినా లోపల నిర్మాణం బలహీనపడినవి ఏమైనా ఈ సర్వేల్లో మిస్ అయ్యాయా అనేది గమనించాలి. ఢిల్లీ ఘటన తర్వాత మళ్ళీ మరో ప్రమాదం జరక్కుండా అసలు ఒకసారి చెక్ చేయాలి.

ప్రతి పాత భవనం ప్రమాదకరం అని చెప్పలేం. అలాగే ప్రతి అనుమతి లేని నిర్మాణం రేపే కూలిపోతుందని కూడా కాదు. కానీ పెద్ద పగుళ్లు, వంగిన గోడలు, నీరు నిలిచే సెల్లార్లు, పాత నిర్మాణంపై కొత్త ఫ్లోర్లు వంటి వాటిని మరోసారి పరిశీలిస్తే నష్టం లేదు. ముఖ్యంగా ఎక్కువ మంది ఉండే పీజీలు, హాస్టళ్లు, కమర్షియల్ భవనాలపై ఫోకస్ పెడితే మంచిది. ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించడం ఒక పని. ప్రమాదకరంగా ఉండి కూడా ఆ లిస్ట్‌లోకి రానివి ఏమైనా ఉన్నాయా అని వెతకడం మరో పని. ఢిల్లీ ఘటన తర్వాత హైదరాబాద్‌లో ఇప్పుడు రెండో దానిపైనే ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.