భోగాపురం యువకులు హద్దులు దాటారు

నిన్నా మొన్నటి వరకు భోగాపురం పేరు వినగానే అల్లూరి సీతారామరాజు విమానాశ్రయమే గుర్తుకు వచ్చేది. రెండు రోజులుగా భోగాపురం పేరు గుర్తుకు రాగానే మోటారు బైక్ మెకానిక్ మహేష్ రౌడీయిజం కళ్ళ ముందు కదులుతుంది. అంగబలం, ఆర్ధిక బలం చూసుకొని ఒక సామాన్యుడి మీద దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు మనం ఏ కాలంలో వున్నామా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఏమి జరిగిందంటే…

భోగాపురంలో రామచంద్ర రాజు పేటకు చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తి మహేష్ అనే మెకానిక్ వద్ద రిపేర్ తన మోటారు బైకు రిపేర్ చేయించుకున్నాడు. బైకు రిపేర్ కు సంబందించి అధికంగా బిల్లు వేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. మాటా మాటా అనుకున్నారు. దీంతో మెకానిక్ మహేష్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. రాజేష్ మీద దాడి చేశాడు.

అప్పటికీ మహేష్ కోపం చల్లారలేదు. రాజేష్ బట్టలూడదీసి చేతులు, కాళ్లకు తాళ్ళు కట్టేసి కొంత దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయక పోవడంతో మరింత రెచ్చిపోయాడు. సినిమా తరహాలో మెడకు తాడు కట్టి బైక్ మీద కూర్చొని ఈడ్చుకుంటూ నడి రోడ్డు మీద తిప్పాడు. ఈ ఘటన ను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పెట్టారు. దీంతో తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బైక్ మెకానిక్ మహేష్, అతడికి సహకరించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కిడ్నాప్, చిత్రహింసలకు గురి చేయడం వంటి కేసులు కూడా పెట్టారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.